దండేపల్లి: పడిన చినుకు పడినట్లు నేలలో ఇంకాలి.. భూగర్భ జలమట్టం పెరగాలి.. ఇళ్లలోని వృథా నీరు భూమిలోకి చేరాలనే లక్ష్యం. ఎల్నినో ప్రభావం పడకుండా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పెద్దఎత్తున నీటి సంరక్షణకు ఫాంపాండ్స్, ఊట కుంటలు, బోర్వెల్ రీచార్జీ స్ట్రక్చర్లు, ఇళ్లలో ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించింది. పైగా లక్ష్యాన్ని కూడా ఖారారు చేసింది. అందులో కొన్ని పనులకు మంజూరు లభించింది. మరి కొన్నిచోట్ల పనులు ప్రారంభం అయ్యాయి. ఉపాధి హామీ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన సూచనలు, ప్రమాణాలకు అనుగుణంగా వీటి నిర్మాణాలు చేపట్టనున్నారు. జిల్లాలో భూగర్భ జలమట్టం పెంచేందుకు వీబీజీ రామ్జీ ద్వారా ప్రభుత్వం రైతుల పొలాల్లో పాంపాండ్స్ 290, ఊట కుంటలు 295, బోర్వెల్ రీచార్జీ స్ట్రక్చర్లు 218, ఇళ్లలో ఇంకుడు గుంతలు 31 వేలు, గ్రామాల్లో నీటి ట్యాంకులు, బోర్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంగన్వాడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆవరణలో 260 సామూహిక ఇంకుడు గుంతలను మంజూరు చేసింది.
మహిళా సంఘాలకు ప్రాధాన్యం
స్వయం సహాయక సంఘాల్లో సభ్యుల కుటుంబాల పొలాల్లోనే ఫాంపాండ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో వీవో లీడర్లు తమ సంఘంలో ఫాంపాండ్స్ అవసరమున్నవారి వివరాలు ఉపాధి హామీ సిబ్బందికి అందించిన తరువాత, ఉపాధిహామీ క్షేత్ర సహాయకులు మొదట రైతుల ఇళ్లకు వెళ్లి ఆ ఇంట్లో మహిళలు మహిళా సంఘంలో సభ్యులుగా ఉన్నారో? లేదో గుర్తించాకే సదరు రైతు పొలంలో పాంపాండ్ నిర్మిస్తారు. ఇవే కాకుండా నీరు వృథా కాకుండా గ్రామాల్లో వర్షం నీరు మురుగు కాలువల్లో చేరకుండా వీధుల్లో పల్లపు ప్రదేశాలు గుర్తించి ఇంకుడు గుంతలు తవ్వేందుకు ప్రాధాన్యం కల్పించారు.
భూగర్భ జలాల పెంపుకోసం..
భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణకు జిల్లాలో పాంపాండ్స్, ఊట కుంటలు, బోర్వెల్ రీచార్జీ స్ట్రక్చర్లు, ఇళ్లలో ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణానికి కార్యాచరణ రూపొందించింది లక్ష్యం ఖరారు చేయడంతో పాటు పనులు మంజూరు చేశాం.
– కిషన్, డీఆర్డీవో, మంచిర్యాల
జిల్లాలో ఫాంపాండ్స్, ఇంకుడు గుంతల లక్ష్యం ఇలా..
పనిపేరు లక్ష్యం మంజూరు పనులు ప్రారంభించినవి
ఫాంపాండ్స్ 326 290 112
ఇళ్లలో ఇంకుడు గుంతలు 61,200 31,000 500
సామూహిక
ఇంకుడు గుంతలు 306 260 45
బోర్ రీచార్జ్లు 306 218 19
ఊట కుంటలు 306 295 83


