మంచిర్యాలటౌన్: కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై, ఫారెస్ట్ ఉద్యోగ అభ్యర్థులకు 60రోజుల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 20న రాజీవ్గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో ఉచిత శిక్షణతోపాటు మధ్యాహ్న భోజనం, స్టడీ మెటీరియల్స్ ఉచితంగా ఇస్తామని, ప్రిలిమ్స్లో అర్హత సాధించిన వారికి ఫిజికల్ టెస్టులో శిక్షణ కూడా ఇస్తామని అన్నారు. ఆసక్తి కలిగిన వారు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఈ నెల 15, 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకుంటే ఎంపిక చేసి 20నుంచి శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించేందుకు హరే కృష్ణా మూవ్మెంట్ చారిటబుల్ ట్రస్టు(ఇస్కాన్ సంస్థ) ఆధ్వర్యంలో పాత మెడికల్ కాలేజీ ఆవరణలో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ కార్యక్రమాన్ని సైతం నియోజకవర్గంలో 20న ప్రారంభిస్తామని తెలిపారు. మంచిర్యాల నగర ప్రజలకు మంగళవారం నుంచి తాగునీరు అందిస్తామని అన్నారు. ఈ సమావేశంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, నగర కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూముల నరేష్ పాల్గొన్నారు.


