మంచిర్యాలరూరల్(హాజీపూర్): బస్సు కింద పడి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన హాజీపూర్ మండలం రాపల్లి స్టేజీ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హాజీపూర్కు చెందిన ఆసాది లింగయ్య(55) ప్రైవేట్ పాఠశాల బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం ఆటోలో మంచిర్యాల వైపు వెళ్తున్నాడు. మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును చూసిన లింగయ్య ఒక్కసారిగా బస్సు కిందకు దూకాడు. తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య జయశీల, ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న కుమారుడు సునీల్, కుమార్తె సుజాత ఉన్నారు. ఈ ఘటనపై పోలీస్స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు అందలేదు. లింగయ్య ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ తీవ్ర మనస్థాపానికి గురై బస్సు కిందపడి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఉరేసుకుని భర్త
సిర్పూర్(టి): భార్యతో జరిగిన గొడవ కారణంగా మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిర్పూర్(టి) ఎస్సై సాగర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లోనవెల్లి గ్రామానికి చెందిన బెండారి పితాంబర్(53), పవిత్ర దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వ్యవసాయం చేసుకుని జీవిస్తున్నారు. గ్రామంలో వారికి 12 ఎకరాల భూమి ఉంది. పదెకరాల భూమి కౌలుకు ఇస్తూ రెండెకరాలు సొంతంగా వ్యవసాయం చేసుకుంటుండేవాడు. ఈసారి 12 ఎకరాల భూమి తామే స్వతహాగా చేసుకుందామని భార్య..భర్త పితాంబర్కు చెప్పింది. తనకు ఆరోగ్యం బాగాలేదని 12ఎకరాల భూమి వ్యవసాయం చేయడం సాధ్యం కాదని చెప్పగా శుక్రవారం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మనస్తాపం చెందిన పితాంబర్ శనివారం ఉదయం ఇంట్లో దూలానికి ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


