సిర్పూర్(టి): ఎగువన మహారాష్ట్రలో నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పెన్గంగ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహం, మహారాష్ట్ర వార్ద నదిపై ఉన్న గేట్లు ఎత్తేయడంతో నది ఉగ్రరూపం దాల్చింది. శనివారం వరద ఉధృతి పెరుగుతుండడంతో మండలం మీదుగా ఉన్న రెండు అంతర్రాష్ట్ర రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. వెంకట్రావ్పేట్–పోడ్సా అంతర్రాష్ట్ర రహదారిలో హైలెవల్ వంతెనపై వరద చేరడం, సిర్పూర్(టి)–మాకిడి అంతర్రాష్ట్ర రహదారిలో హుడ్కిలి సమీపంలోని లోలెవల్ వంతెన వరద నీటిలో మునిగింది. దీంతో హుడ్కిలి, జక్కాపూర్, మాకిడి గ్రామాలతోపాటు మహారాష్ట్ర గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రెవెన్యూ, పోలీసు అధికారులు వంతెనల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి ప్రయాణాలు సాగించకుండా చర్యలు చేపట్టారు.


