● 30వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో
● క్రస్ట్ గేట్లు పూర్తిగా మూసివేత
● ప్రస్తుతం నీటిమట్టం 318.10మీటర్లు
● హైడల్ ప్రాజెక్టుకు 8వేల క్యూసెక్కులు
గద్వాల/ఆత్మకూరు/అచ్చంపేట: కర్నాటక ప్రాంతంలో కృష్ణాబేసిన్లో భారీ వర్షాలు కురస్తున్నాయి. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జూరాలకు స్థిరంగా వరద వచ్చిచేరుతుంది. సోమవారం జూ రాలకు ఇన్ఫ్లో రూపంలో క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతుంది. ప్రాజెక్టు గేట్లు పూర్తిగా మూసివేశారు. జూరాల జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా.. ప్రస్తుతం 318.10మీటర్లుగా ఉంది. అదేవిధంగా 9.567టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.810 టీఎంసీలు ఉంది. అదేవిధంగా హైడల్ విద్యుత్తు కేంద్రానికి 8336క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టుకు–750క్యూసెక్కులు, భీమా–1–1300, భీమా–2–నిల్, కోయిల్సాగర్కు 630క్యూసెక్కులు, ప్రాజెక్టు ప్రధా న ఎడమ కాల్వకు 274క్యూసెక్కులు, ప్రధాన కుడి కాల్వకు 625క్యూసెక్కులు, సమాంతర కాల్వకు–నిల్, మొత్తంగా ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లో రూపం 13,480 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
తగ్గిన విద్యుదుత్పత్తి
వరద తగ్గడంతో సోమవారం కేవలం 4 యూనిట్లద్వారా విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 2 యూనిట్ల ద్వారా 78 మెగావాట్లు, 46.242 ఎంయూ, దిగువలో 2 యూనిట్ల ద్వారా 80 మెగావాట్లు, 33.561 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఎగువ, దిగువ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఇప్పటివరకు 79.803 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని విజయవంతంగా చేపట్టామన్నారు.
182.6050 టీఎంసీల నీటినిల్వ
శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పూర్తిగా తగ్గముఖం పట్టింది. నారాయణపూర్, ఆల్మట్టి ప్రా జెక్టుల నుంచి వరద దగ్గడంతో జూరాల గేట్ల ద్వారా నీటివిడుదల నిలిపివేశారు. సోమవారం సాయంత్రం 6గంటల వరకు జలాశయంలో 182.6050 టీఎంసీల నీటి నిల్వ చేరుకుంది. జూరాల విద్యుత్ కేంద్రం ద్వారా 23,455 క్యూసెక్కులు మాత్రమే వస్తోంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు (269.750 మీటర్లు) కాగా, ప్రస్తుతం 878.60 అడుగులు (267.900 మీటర్లు) నమోదైంది. జలాశయంలో 182.60500 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రాజెక్టు మొత్తం నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలోని నాలుగో యూనిట్ను ట్రయల్ రన్ను సోమవారం ప్రారంభించారు. 5యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రం ద్వారా 35,315 క్యూసెక్కుల నీటిని దిగువ నాగర్జనసాగర్కు వదలుతున్నారు. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 0.212 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా, కుడిగట్టు విద్యుత్ కేంద్ర ద్వారా 7.56 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి 2,322 క్యూలసెక్యులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్యులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 8వేల క్యూసెక్యుల చొప్పున మొత్తం 26,471 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. జలాశయ పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.


