అలంపూర్ : వర్షాభావ పరిస్థితులతో ఈ ఏడాది చాలా మంది రైతులు సమయానికి వరి నాట్లు వేయలేకపోయారు. దీంతో ముందుగా వేసుకున్న నారుమళ్లలో వరి నార ముదిరే అవకాశం ఉంటుంది. అయితే ముదిరిన నారు వేసుకునే యాజమాన్య పద్ధతుల్లో కేవలం సన్నరం వరి వంగడాలకు మాత్రమే వర్తిస్తోందని మండల వ్యవసాయ శాఖ అధికారి నాగార్జున్ రెడ్డి రైతులకు సూచించారు.
సాధారణ నారు : సాధారణంగా 30 రోజుల నారును నాటు వేస్తారు. సాలుకు మధ్య 20 సెంటిమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 15 సెంటిమీటర్ల దూరంతో నాటు వేసుకోవాలి.
ముదిరిన నారు : నారు వేసి 30 రోజులు దాటిందంటే దానిని ముదిరిన నారుగా పరిగణించాలి. 30 నుంచి 40 రోజుల నారును నాటేటప్పుడు సాలుకు సాలుకు మధ్య 15 సెంటిమీటర్లు, మొక్కకు మొక్క కు మధ్య 15 సెంటిమీటర్ల దూరంతో నాటాలి.
● 40 నుంచి 50 రోజుల నారును నాటేటప్పుడు సా లుకు మధ్య 15 సెంటిమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటిమీటర్లు స్థలాన్ని వదలాలి.
● ముదిరిన నారు నాటేటప్పుడు నారు పిలకలు ఎక్కువగా నాటాలి. ఎందుకంటే నాటు వేయడం ఆలస్యమైంది కాబట్టి గంట తక్కువగా పోస్తుంది. అందువల్ల నారు మొక్కలు ఎక్కువగా నాటాలి. అలాగే కుదురుకు 4 లేదా 5 మొక్కల చొప్పున నాటు వేసుకోవాలి.
ముదురు నారుకు..ముదురు నారు పొలానికి రెండు దఫాలుగా మాత్రమే ఎరువులు వేయాలి.అది కూ డా రెట్టింపుతో వాడాలి. ముదురునారు నాటినప్పు డు నత్రజని ఎరువు అధికంగా వాడాలని, 70 శా తం దమ్ము దశలో 30 శాతం అంకుర దశలో వాడాలి.
● భాస్వరం ఎరువు 50 శాతం పోటాష్ ఎరువుతో కలిపి మొదటి సారి దమ్ములో వేయాలి. ఇలా చేయడం వలన పిలకలు తొందరగా వేసి దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది.
● మొదటి దఫా (నాటు వేసే సమయంలో) 50 కిలోల యూరియా, 50 కిలోల డీఏపీ, 15 కిలోల పోటాష్ వేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే దిగుబడి తగ్గకుండా ఉంటుంది.
కాలి బాటలు తప్పనిసరి..
వరి నాటు వేసే సమయంలో 2 మీటర్ల తర్వాత 20 సెంటిమీటర్ల చొప్పున తూర్పు, పడమరలుగా కాలిబాటలు వదలడం చాలా మంచిది. దీంతో పంటకు గాలి బాగా తగులుతుంది. పైగా తెగుళ్లు సోకకుండా ఉంటుంది. ఎరువులు, పురుగుల మందులు, కలుపు మందులు వేయడానికి ఉపయోగపడతాయి.
వరి నారుమడి
పొలంలో కాలిబాట పద్ధతి
పాడి–పంట


