● తెలంగాణ, ఏపీలో 16 చోరీ కేసులు ఉన్నట్లు గుర్తింపు
మహబూబ్నగర్ క్రైం: ఇళ్ల ఎదుట, రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేసే ఓ సీరియల్ దొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో నగరంలో వాహనాలు చోరీ చేసి మళ్లీ దొంగతనం చేయడానికి యత్నిస్తున్న క్రమంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అరెస్టు చేశారు. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ కథనం ప్రకారం.. నగరంలోని సుభాష్నగర్కు చెందిన ముడావత్ అజయ్ ఈ నెల 2న తన ఆటోను ఇంటి ఎదుట పార్క్ చేయగా గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి విచారణలో భాగంగా సీసీ కెమెరాలు పరిశీలించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఇతర ఆధారాలతో నిందితుడి వివరాలు సేకరించినట్లు తెలిపారు. అప్పటి నుంచి అతనిపై నిఘా కొనసాగుతుందని ఈ క్రమంలో మంగళవారం ఎర్ర సత్యం చౌరస్తాలో దొంగతనానికి వచ్చాడనే సమాచారంతో అక్కడికి చేరుకొని రంగారెడ్డి జిల్లా యాలాల్ మండలం కమలాపూర్కు చెందిన బోయిన శ్రీకాంత్ అనే దొంగను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ వెల్లడించారు. విచారించగా తాండూర్, యాలాల్, హైదరాబాద్, ఏపీలోని అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో కలిపి దాదాపు 16 వాహనాల చోరీ కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఆయా కేసుల్లో అనేకసార్లు జైలుకు వెళ్లడం జరిగిందన్నారు. శ్రీకాంత్ నుంచి సుభాష్నగర్లో దొంగతనం చేసిన ఆటోతో పాటు హైదరాబాద్ కొండాపూర్లో దొంగతనం చేసిన బైక్ను రికవరీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ శివనాగేశ్వర్రావు, క్రైంటీం హెడ్కానిస్టేబుల్ శేఖర్, కానిస్టేబుళ్లు అశోక్, ప్రవీణ్, కురుమూర్తి పాల్గొన్నారు.


