గట్టులో గుప్తనిధులు లభించిన వ్యవహారంలో కొందరు నాయకులు తమ చేతివాటాన్ని ప్రదర్శించినట్లు విమర్శలు వినిపిస్తున్నారు. గుప్తనిధులు లభించిన వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, వారిని నమ్మించి, బెదిరించి కొన్ని బంగారం ఆభరణాలను నొక్కేసినట్లు ఆరోపణలు చక్కర్లు కొడుతున్నాయి. గుప్తనిధుల వ్యవహారం 25రోజులుగా గట్టులో పుకార్లు షికార్లు చేస్తున్నప్పటికీ పోలీసులు పట్టించుకోక పోవడంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు చేసిన బిచ్చాలపేట ప్రాంతాన్ని పోలీసులు రెండు, మూడురోజులు పరిశీలించినట్లు చుట్టుపక్కల ఇళ్లవారు తెలిపారు. గుప్తనిధులను దక్కించుకున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్న వ్యక్తులు గ్రామంలో దర్జాగా తిరుగుతున్నా.. వారిని స్టేషన్కు పిలిచి విచారణ చేయక పోవడంపై గట్టు గ్రామస్తులు పోలీసులపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.


