మొండి జాతి కలుపు నివారణ..
మిడ్జిల్: ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి.కానీ రైతులు ఏ పైరుకు ఏ మందు ఎంత మోతాదు,ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని తెలుసుకున్న తర్వాత వాడాలని మండల వ్యవసాయ అధికారి సిద్దార్థ సూచించారు. కలు పు మందు వాడకంలో రైతులు తగిన సూచనలు తీ సుకున్న తర్వాతే పిచికారీ చేయాలని పేర్కొన్నారు.
● మాగాణి వరిలో నాటిన 3– 5 రోజుల్లో కలుపు నిర్మూలనకు ఎకరానికి 35 గ్రాముల ఆక్సాడయార్టిల్ పొడిమందును వాడుకోవాలి. అలా కాకుండా ఎక్కువ మోతాదులో వాడితే పైరు దెబ్బ తింటుంది, తక్కువ మోతాదులో వాడితే కలుపు నిర్మూలన సరిగ్గా జరుగదు. అదే విధంగా 3– 5 రోజుల కన్నా ఆలస్యంగా వాడితే కలుపు నిర్మూలన సరిగ్గా జరుగదు.
● వరిలో వెడల్పాకు కలుపు మొక్కల నిర్మూలనకు వరినాటిన 25– 30 రోజుల కు నీటిని తీసి 2, 4– డీ సోడియం సాల్ట్ పొడి మందును ఎకరాకు 400– 500 గ్రాముల చొప్పున 200 లీటర్ల నీటీలో కలిపి పిచికారీ చేయాలి. ఎట్టి పరిస్థితు ల్లో వెడల్పాకు పంటలైన మినుములు, పెసర, పత్తి, పొగాకు, మిరప మొదలగు పంటల్లో వాడకూడదు.
● మొక్కజొన్నలో అట్రజిన్ మందు సురక్షితం, కానీ ఈ మందు అవశేషాలు భూమిలో ఎక్కువ కాలం ఉంటాయి. కావున తగిన జాగ్రత్తలు తీసుకోని వాడుకోవాలి.
● నీటిలో కరిగే పొడి రూపంలో ఉన్న మందులను ఇసుకలో కలిపి వెదజల్లకూడదు.
● సాధ్యమైనంత వరకు కలుపు మందులను హ్యాండ్ స్ప్రేయర్తోనే పిచికారీ చేయాలి.పవర్ స్ప్రేలను విని యోగించే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి.
● ఎండ మరీ ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే గాలి ఎక్కువగా వీస్తున్నపుడు కలుపు మందు పిచికారీ చేయకూడదు.,ఉదయం,సాయంత్రం వేళ ల్లో గాలి తక్కువగా ఉన్నప్పుడు పిచికారీ చేయాలి.
● కలుపు మందు కూడా పురుగు మందు వలనే విషపూరితంగా ఉంటాయి. కనుక వీటిని ఆహార పదార్థాలకు, పిల్లలకు దూరంగా ఉంచాలి.
● ఆహార పంటలు, పశువుల మేతకు వాడే పైర్ల మీద కలుపు మందు పిచికారీ చేసిన తర్వాత కాలపరమితి తర్వాతనే పైర్లు కోయాలి.
● పొలంలో పెరిగే చాలా రకం కలుపు మొక్కలు ఎన్నో ప్రయోజానాలు కల్గి ఉంటాయని, వాటి గురించి అవగాహన పెంచుకున్నట్లయితే కలుపు మొక్కలు ఆకుకూరగా, ఔషధాలుగా, పశుగ్రాసంగా సేంద్రియ ఎరువుగా, కీటక నాశినులుగా ఉపయోగపడతాయి.
తుంగ: పొలం దున్నక ముందు కానీ లేదా మొదటి పంట తర్వాత రెండో పంట వేయక ముందు గాని తుంగను 15– 20 రోజుల వరకు పెరిగిన తర్వాత గైఫోసేట్ 41 ఎస్ఎల్ అనే మందును ఎకరానికి 2–2.5 లీటర్లు అనగా లీటర్ నీటికి 10 మి.లీ. చొప్పున కలిపి, కలుపు బాగ తడిసే విధంగా పిచికారీ చేస్తే తుంగను నివారించవచ్చు.
వయ్యారిభామ: ఈ కలుపు నివారణ చర్యలు సామూహికంగా చేపట్టాలి. ఎందుకంటే ఒక మొక్క నుంచి సుమారు 15,000– 30,000 వేల విత్తనాలు వృద్ధి చెందుతాయి. కాబ్బటి పూతకు రాకముందే భూమిలో కలియదున్నాలి, వయ్యారిభామ కలుపు పంట పొలాల్లో ఎక్కువగా ఉన్నట్లు అయితే బంతి పంటతో, పంట మార్పిడి చేస్తే ఉధృతిని కొంత వరకు తగ్గించవచ్చని సూచించారు.
పాడి–పంట


