● శేక్షావలి, షాషావలి దర్గాలను దర్శించుకున్న భక్తులు ● గంధం మోసిన పీఠాధిపతి నూర్బాబా
హొళగుంద: రాష్ట్రంలో ప్రాధాన్యత కలిగిన దర్గాల్లో ఒకటైన ఎల్లార్తి శేక్షావలి, షాషావలి తాతల దర్గా ఉరుసులో భాగంగా బుధవారం ఉరుసుతో పాటు తెల్లవారుజామున దర్గాలకు చేరిన గంధం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మత సామరస్యానికి ప్రతాకగా నిలిచే ఈ ఉత్సవాలను తిలకించడానికి రాష్ట్ర నలమూలల నుంచే కాకా పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలి వచ్చారు.
పురవీధుల్లో ఊరేగిన గంధం
తెల్లవారుజామున దర్గా పీఠాధిపతి నూర్బాబా దర్గాలో ప్రత్యేక ఫాతెహాలు చదివి అక్కడి నుంచి గంధం మోసుకుని గ్రామ పురవీధుల గుండా ఊరేగింపుగా వెళ్లి తిరిగి దర్గాకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు, పకీరులు ప్రదర్శించిన కర్రసాము విన్యాసాలు, నృత్యాలు, పాటలు అమితంగా ఆకట్టుకున్నాయి. గంధం దర్గాకు చేరడంతో భక్తులు ఆయా దర్గాల్లో సమాధులను దర్శించుకుని నైవేద్యాలు, చాదర్లు సమర్పించి ప్రత్యేక ఫాతెహాలు చేశారు. బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉరుసులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్య పర్యవేక్షణలో ఆలూరు సీఐ రవిశంకర్రెడ్డి ఆధ్వర్యంలో హొళగుంద ఎస్ఐ దిలీప్కుమార్తో పాటు 60 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. గురువారం జియారత్ కార్యక్రమంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవంలో భక్తులకు ఎస్ఎస్వీ ఆధ్వర్యంలో ట్యాంకర్లతో మంచినీటి సరఫరా, ఆదోని మధు హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు.


