కోడుమూరు రూరల్: వానలు లేక, పంటలు పండక తీవ్రంగా నష్టపోయిన కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన రైతు బోయ లక్ష్మన్న (35) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. బోయ లక్ష్మన్న తనకున్న రెండెకరాల పొలంతో పాటు మరో ఎనిమిది ఎకరాలను కౌలుకు తీసుకున్నాడు. ఈ ఏడాది ఎనిమిది ఎకరాల్లో పత్తి, రెండెకరాల్లో కంది పంట సాగు చేశాడు. వానల్లేక పంటలన్నీ మొలక దశలోనే ఎండిపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. పంటల సాగుకు, కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు రూ.10 లక్షలకు చేరుకున్నాయి. గురువారం భార్య శారదమ్మ అన్నకు రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్లారు. మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో రైతు బోయ లక్ష్మన్న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయంత్రం కుమారుడు సోమేష్ హైస్కూల్ నుంచి ఇంటికి రాగా తండ్రి బోయ లక్ష్మన్న ఉరేసుకుని ఉండటాన్ని గమనించి లబోదిబోమంటూ చుట్టుపక్కల వారిని పిలుచుకువచ్చాడు. అప్పటికే రైతు బోయ లక్ష్మన్న మృతి చెంది ఉన్నాడు. రైతుకు భార్య శారదమ్మతో పాటు, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. కుటుంబ పెద్ద దిక్కు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.


