ఏర్పాట్లు పూర్తి
● కొండలరాయుడికి
నేడే తేళ్ల సమర్పణ
కోడుమూరు రూరల్: శ్రావణమాసంలో వచ్చే మూడో సోమవారం కోడుమూరు కొండపై వెలసిన శ్రీకొండలరాయుడికి భక్తులు తేళ్లను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ వింత ఆచారాన్ని ప్రజలు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. విషపురుగులైన తేళ్లను చూస్తే ఎక్కడైనా ప్రజలు ఆమడదూరం పరుగెడతారు. ఇక్కడ కొండమీద మాత్రం భక్తులు చిన్న చిన్న రాళ్లను ఎత్తుతూ వాటికింద ఉండే తేళ్లను ఎలాంటి జంకుబొంకులేకుండా పట్టుకొని స్వామికి నైవేద్యంగా సమర్పించి కోరికలను కోరుకుంటారు. చిన్నా పెద్దా అన్న తేడా లేకుండా తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారికి సమర్పిస్తారు. స్వామి వారికి సమర్పించేందుకు తేలును పట్టుకునే సమయంలో కుట్టినా ఏమి కాదని భక్తుల నమ్మకం.
గుడి నిర్మాణం
కోడుమూరు కొండపై శ్రీకొండరాయుడు విగ్రహాని ఎన్నో ఏళ్లుగా ప్రజలు పూజలు చేస్తున్నారు. అయితే కోడుమూరుకు చెందిన సౌరెడ్డి అనే భూస్వామి తనకు కుమారుడు పుడితే స్వామికి ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నాడు. కుమారుడు జన్మించడంతో మొక్కు ప్రకారం 1970లో గుడి నిర్మించారు. ప్రతి శ్రావణమాసంలో ప్రజలు ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు.
వంశపారపర్యంగా స్వామి వారికి మా వంశస్తులే పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. సోమవారం జరిగే ఉత్సవం కోసం ఆలయానికి రంగులు వేయించాం. భక్తుల సౌకర్యార్థం మధ్యాహ్నం నుంచి అన్నదానం చేస్తాం. నీటి వసతి కోసం ఏర్పాట్లు పూర్తి చేశాం.
– మనోహర్రెడ్డి, ఆలయ సంరక్షకుడు.


