మహిళలను స్టేషన్కు
తరలించిన పోలీసులు
నీళ్ల కోసం పోలీస్స్టేషన్ ఎదుట నిరసన తెలుపుతున్న మహిళలు
కోడుమూరులో నీళ్ల కోసం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్న మహిళలు
కోడుమూరు రూరల్: నియోజకవర్గ కేంద్రం కోడుమూరులో ఒక రోజు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 15 రోజులైనా కుళాయిలకు మంచినీళ్లు రాలేదు.. మంచినీటి సమస్య తీవ్రమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో విసిగి పోయిన మహిళలు ఖాళీ బిందెలతో మంగళవారం రోడ్డెక్కారు. ముందుగా మహిళలు ఖాళీ బిందెలతో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లి అక్కడి నుంచి పాతబస్టాండ్ సెంటర్ చేరుకుని కర్నూలు–బళ్లారి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. 15 రోజులైనా నీళ్లను సరఫరా చేయలేకపోతే తాము ఎలా బతకాలంటూ.. నీళ్ల కోసం ఎక్కడికి వెళ్లాలంటూ తాగునీరు కూడా సరఫరా చేయని ప్రభుత్వాలెందుకంటూ మహిళలు రోడ్డుపై బైఠాయించి గంటకు పైగా ధర్నా చేయడంతో రోడ్డుకిరువైపుల కిలో మీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ప్రభుత్వానికి మా గోడు పట్టదా..
గత ఎన్నికల్లో కోడుమూరు శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామంటూ ఓట్లు వేయించుకున్న కూటమి ప్రభుత్వానికి తమ గోడు పట్టదా అని మహిళలు నినదించారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపులైన్ ఏర్పాటు చేసి నీళ్లిస్తామని ఓట్లు వేయించుకున్న నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత అదిగో.. ఇదిగో అంటూ కాలం వెళ్లదీస్తున్నారని వాపోయారు. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి పైపులైన్ వేయించి శాశ్వత నీటి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, లేకపోతే ఓట్ల కోసం తమ ఇళ్ల వద్దకు వచ్చే నాయకులకు స్థానిక ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామంటూ మహిళలు హెచ్చరించారు.
పోలీసులతో వాగ్వాదం..
కోడుమూరులోని కాలనీలకు 15 రోజులకోసారి కూడా తాగునీటిని వదలడం లేదంటూ ఆగ్రహించిన మహిళలు ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు. మహిళల ధర్నాతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో కోడుమూరు పోలీసులు అక్కడికి చేరుకుని ధర్నాకు అనుమతి లేదని వెంటనే విరమించాలని కోరారు. అయితే మహిళలు తమ నీళ్ల సమస్యను పరిష్కరిస్తేగాని ధర్నా విరమించని భీష్మించడంతో పాటు, పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. చివరకు పోలీసులు బలవంతంగా మహిళలను పోలీస్స్టేషన్కు తరలించగా, అక్కడ కూడా మహిళలు తమకు నీళ్లు ఇచ్చే వరకు వెళ్లేది లేదంటూ స్టేషన్ ముందు నిరసన తెలిసారు. చివరకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పోలీసులు ఫోన్లో మాట్లాడించడంతో మహిళలు ధర్నా విరమించారు.
కోడుమూరులో నీళ్ల కోసం
రోడ్డెక్కిన మహిళలు
పాతబస్టాండ్ సెంటర్లో
గంటకు పైగా రాస్తారోకో
ధర్నాకు అనుమతి లేదంటూ


