● సెప్టెంబర్ 2వ తేదీ వరకు నిర్వహణ
మంత్రాలయం: శ్రీరాఘవేంద్రస్వామి 355వ సప్త ఆరాధనోత్సవాలను విజయవంతం చేయాలని శ్రీమఠం పీఠాఽధిపతి సుబుధేంద్రతీర్థులు పిలుపునిచ్చారు. సోమవారం శ్రీమఠంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఉత్సవాలు చేపడుతున్నట్లు తెలిపారు. 27న ధ్వజారోహణతో ఉత్సవాలకు అంకురార్పణ పలుకుతామన్నారు. 29న పూర్వారాధన, 30న మధ్యారాధన, 31న ఉత్తరారాధనలో భాగంగా మహారథోత్సవం ఉంటుందని వెల్లడించారు. ఆరాధనోత్సవాల్లో పాల్గొనే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా చూస్తామన్నారు. పుణ్యస్నానాలు, శౌచాలయాలు, వసతి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటామన్నారు. భక్తుల సౌకర్యార్థం రూ.56 కోట్లతో తాగునీటి ఎస్ఎస్ ట్యాంకు, శ్రీమఠం, వసతి నిలయాలకు అంతర్భాగ డ్రెయినేజీ వ్యవస్థ, ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మిస్తున్నట్లు వివరించారు. భక్తుల వసతి కోసం ఆర్అండ్బీ స్థలంలో 12 అంతస్తుల వసతి భవనం, సుయతీంద్రతీర్థుల నామధేయంతో 400 గదులు సముదాయం నిర్మిస్తున్నట్లు తెలిపారు. భక్తుల సహకారంతో శ్రీమఠం దినదినాభివృద్ధి చెందుతోందన్నారు. నదిలో నీరు లేనందున ప్రత్యామ్నాయంగా భక్తులకు షవర్లు అందుబాటులో ఉంచుతామన్నారు. ఉత్సవాలకు రెవెన్యూ, పోలీసు, పంచాయతీ అధికారులు సహకరించాలని కోరారు.


