చిలకలపూడి(మచిలీపట్నం): పింఛన్ బిక్ష కాదని, ఉద్యోగుల హక్కు అని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రజాస్వామ్యయుతంగా అమలు చేయా లని ఏపీ సీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పేటేటి సత్యనారాయణ డిమాండ్ చేశారు. సీపీఎస్ ఉద్యోగులందరికీ పాత పింఛన్ విధానాన్ని వర్తింపజేయాలని కోరారు. కలెక్టరేట్లో సీపీఎస్ ఉద్యోగులతో కలిసి ఉద్యమ కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్ ఒకటో తేదీన చలో విజయవాడ కార్యక్రమంపై ముద్రించిన వాల్పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైనప్పటికీ ఇప్పటి వరకు సీపీఎస్పై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఒక సంవత్సరంలోపు సీపీఎస్ ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపుతామని ఇచ్చిన హామీపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దీంతో సీపీఎస్ ఉద్యోగులు తీవ్ర నిరాశతో ఉన్నారన్నారు. తక్షణమే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర జనరల్ సెక్రటరీ సీఎం దాస్ మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటో తేదీన జరిగే చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు ఎం.వి.శ్యామ్నాథ్, ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.నాంచారయ్య, ఏపీఆర్ఎస్ఏ సీనియర్ నాయకుడు నెల్సన్పాల్బాబు, ఏపీ జేఏసీ అమరావతి నాయకులు శోభన్బాబు, కిరణ్కుమార్, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.


