న్యూస్రీల్
వరుణుడు నిస్తేజం.. సర్కారు నిర్లక్ష్యం.. రైతన్న నిర్వేదం
నారుమడి ఎండిపోతోంది..
ఎగువన తోడేస్తున్నారు
చల్లపల్లిలోని పొలంలో
నారుమడిని మేస్తున్న పశువులు
పశువులను మేపుతున్నారు!
భూగర్భ జలం అందటంలేదు. చిన్నపాటి దార వస్తోంది. ఎంతలా అంటే మూడు ఎకరాల భూమిని తడపటానికి నెల రోజులు పట్టింది. సాగు చేయడం కష్టంగా మారింది. పూర్తిగా నష్టపోవాల్సిన పరిస్థితి.
– కొక్కిలిగడ్డ రవి, కౌలురైతు, వక్కలగడ్డ
చల్లపల్లి: ఏరువాక పేరుతో హడావుడి చేశారు.. సాగునీరు విడుదల అంటూ ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యే వరకూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు.. ఇక సాగునీటికి ఢోకాలేదని భ్రమపడిన రైతులు చివరికి కన్నీరే మిగిలింది. ఆంధ్రా అన్నపూర్ణగా పేరొందిన కృష్ణాజిల్లాలోనే సాగునీటి కోసం రైతులు అష్టకష్టాలు పడాల్సిన దుస్థితి నెలకొంది. ఎంతో ఆశతో వేసిన నారుమళ్లు ఇప్పుడు రైతుల కళ్లముందే ఎండిపోతున్నాయి. నాట్లు వేద్దామంటే కనీసం పొలంలోని మట్టి కూడా తడవని పరిస్థితి. ఆదుకోవాల్సిన కూటమి సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నెలల తరబడి సాగునీటి కోసం ఎదురుచూసిన రైతులు సమయం మించిపోవటంతో చేసేది లేక నాట్లు వేసే మార్గం కనిపించక నారుమళ్లను పశువులకు మేతగా వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇదీ పరిస్థితి..
చల్లపల్లి మండల పరిధిలోని 5వ నంబర్ కాలువ కింద పరిధిలో సుమారు మూడు వేల ఎకరాల సాగుభూమి ఉంది. కేఈబీ కెనాల్ నుంచి చల్లపల్లి మండలం వెలివోలు దగ్గర ప్రారంభమైన ఈ కాలువ వక్కలగడ్డ మీదుగా రామానగరం వరకూ వస్తుంది. ఇప్పటి వరకూ ఈ కాలువలో పూర్తిస్థాయిలో సాగునీరు ప్రవహించిన దాఖలాలు లేవు. సాగు నీరు విడుదల చేసినప్పటి నుంచి అరకొర నీరే. దీంతో ఎగువన ఉన్న రైతులు వచ్చే కొద్దిపాటి నీటికి అడ్డుకట్టలు వేసి వారి వారి పొలాల్లోకి మళ్లించుకుంటున్నారు. పైన నాట్లు పూర్తయితేగానీ దిగువకు నీరు చేరని పరిస్థితి నెలకొంది. చల్లపల్లి–పామర్రు ప్రధాన రహదారికి ఎడమవైపు ఎగువన అక్కడక్కడా నాట్లు పడినప్పటికీ రోడ్డు ఎడమపక్కన దిగువన ఇంకా నాట్లు పడలేదు. ఈ ప్రాంతంలో కొన్ని చోట్ల విద్యుత్ మోటార్లు ఉన్నప్పటికీ భూగర్భ జలాలు అడుగంటడంతో భూమిలో నుంచి నీరు బయటకు రావటంలేదు. ఫలితంగా విద్యుత్ మోటార్లు నిరుపయోగంగా మారుతున్నాయి. నీరు లేక వేసిన నారుమళ్లు ఎండిపోతున్నాయి.
ఇప్పటికై నా మేల్కొంటారా?
ఇదే ఐదో నంబర్ కాలువ దిగువన రామానగరం వద్ద నారుమళ్లు వేసి 60 రోజులు దాటుతున్నా.. భూమి తడవక నాట్లు వేయలేదు. సాధారణంగా 25 రోజుల నుంచి 35 రోజుల మధ్యలో నాట్లు వేసుకుంటే దిగుబడులు బాగుంటాయి. అయితే నారు వయస్సు 60 రోజులు దాటడంతో అది నాట్లు వేసేందుకు పనికిరాకపోవటంతో రైతులు నారుమడిలో పశువులను దింపి వాటికి మేపుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తక్షణమే ప్రధాన కాలువలకు సాగునీటిని విడుదల చేసి దిగువ ప్రాంత రైతులకు కూడా సమానంగా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని, ఎండిపోతున్న నారుమళ్లను, నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
చల్లపల్లి పద్మావతి ఆస్పత్రి రోడ్డులో
నీరులేక ఎండిపోయిన నారుమడి
5వ నంబర్ కాలువలో కానరాని సాగునీరు,
కాలువకు ఇరువైపులా బీడుగా ఉన్న పొలాలు
కాలువల్లో నీరులేదు, మోటార్లు రావటంలేదు. నారు ఎండిపోతోంది. పొలం తడిపే పరిస్థితి లేదు. నాట్లు వేసే పరిస్థితి లేదు. ఏమి చేయాలో అర్థం కావటంలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి.
– లంక బాలవర్థి, కౌలురైతు, వక్కలగడ్డ
ఐదో నంబర్ కాలువలో వస్తున్న కొద్దిపాటి నీటిని ఎగువ రైతులు అడ్డుకట్ట వేసి తోడేస్తున్నారు. దిగువన ఉన్న మాకు నీరు రావటం లేదు. మాకు ఎప్పుడు నీళ్లు వస్తాయో అర్థం కావడం లేదు. ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోవాలి.
– కొల్లూరు నాగేశ్వరరావు, కౌలురైతు, వక్కలగడ్డ


