ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం సాధారణ భక్తులతో పాటు సారె సమర్పణకు ఉభయ కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ట్రాక్టర్లు, ఆటోలపై ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. భక్తుల వాహనాలతో కెనాల్రోడ్డు, సీతమ్మ వారి పాదాలు, వీఎంసీ ఎదుట పార్కింగ్తో పాటు హెడ్ వాటర్ వర్క్స్ పరిసరాలు రదీగ్దా కనిపించాయి.
మేళతాళాలు, మంగళవాయిద్యాలతో..
మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్మార్ డప్పులు, అమ్మవారి ప్రతిమలతో ఊరేగింపుగా కనకదుర్గనగర్కు చేరుకున్నారు. అక్కడ బలిపీఠం వద్ద అమ్మవారికి నమస్కరించి మహామండపం మీదగా కొండపైకి చేరుకున్నారు. భక్తుల రద్దీతో మహా మండపం నాలుగో అంతస్తు వరకు క్యూలైన్లు కిటకిటలాడుతూ కనిపించాయి. మరో వైపున ఘాట్రోడ్డు మీదగా కొండపైకి చేరుకున్న భక్తులతో క్యూ దేవస్థాన సమాచార కేంద్రం వరకు చేరింది. రద్దీ పెరగడంతో అధికారులు అంతరాలయ దర్శనం రద్దు చేశారు. శుక్రవారం అయినా మహా నివేదన ముందు వరకు భక్తులకు అంతరాలయ దర్శనం కల్పించారు. మధ్యాహ్న సమయానికి మహా మండపం లిప్టు, మెట్ల మార్గాల్లో అడుగు తీసి అడుగు వేసే పరిస్థితి లేక భక్తులు పాత మెట్ల మార్గం ద్వారా కొండపైకి చేరుకున్నారు. దీంతో క్యూలైన్లు త్వరత్వరగా ముందుకు కదిలేలా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. మరో వైపున సాయంత్రం అమ్మవారి పంచహారతుల సేవ అనంతరం రద్దీ మరింత పెరిగింది.


