చిలకలపూడి(మచిలీపట్నం): ఓటర్ల జాబితా సమగ్ర సవరణలో రాజకీయ పార్టీలు, బీఎల్ఏలు సహకరించాలని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో మంగళవారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు అన్ కలెక్టబుల్, అన్ ట్రేస్డ్, షిఫ్టెడ్గా గుర్తించిన ప్రతి ఓటరును మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. బీఎల్వోలు వ్యక్తిగతంగా సంప్రదించి వివరాలను నిర్ధారించాలన్నారు. బీఎల్వోల సూపర్వైజర్లు కూడా ప్రతి బీఎల్వోతో సమీక్ష నిర్వహించి ఓటర్ల జాబితాలో నమోదైన చిరునామా వాస్తవమైనదో లేదో ధ్రువీకరించాలన్నారు. జిల్లాలో ప్రస్తుతం 1.39 లక్షల మంది అన్కలెక్టబుల్గా నమోదయ్యారని వీరిలో ఇప్పటికే మరణించిన ఓటర్ల వివరాలు తొలగింపు ప్రక్రియలో ఉన్నాయన్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో వలసలు ఎక్కువగా ఉండటం వల్ల ఓటర్లను గుర్తించటం కష్టమవుతోందని ఈ దశలో రాజకీయ పార్టీల బీఎల్ఏల సహకారం కీలకమన్నారు.
పామర్రు భేష్..
కొన్ని నియోజకవర్గాల్లో అధికారులు అద్భుతంగా పనిచేశారని ముఖ్యంగా పామర్రు నియోజకవర్గంలో నో మ్యాపింగ్ కేసులు తగ్గించటం అభినందనీయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 2002 నాటి పోలింగ్ కేంద్రాల వివరాలు అందుబాటులో ఉంటే అనుసంధానం సులభమవుతుందన్నారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్ల భౌగోళిక పరిధికి అనుగుణంగా ఓటర్లను క్రమబద్ధీకరించాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకోసం బీఎల్ఏ పరిధిలో ఉన్న ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ ఓటర్ల జాబితాను సిద్ధం చేసి బీఎల్వోలకు అందించాలన్నారు. రానున్న పది రోజులు మిగిలిన ప్రక్రియ కూడా పూర్తి చేసేందుకు రాజకీయ పార్టీలు, బీఎల్ఏలు, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పనిచేస్తే జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపగలమన్నారు. సమావేశంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు షేక్ సలార్దాదా, కొడాలి శర్మ, కొడమంచిలి చంద్రశేఖర్, కూనపరెడ్డి శ్రీనివాసరావు, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
వెనుకబడిన విద్యార్థులను గుర్తించండి..
పెడన: పట్టణంలోని భట్టజ్ఞానకోటయ్య(బీజీకే)జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యాశాఖకు మాత్రమే సమాచారం ఇచ్చి విచ్చేసిన ఆయన తొలుత పాఠశాలలో ఎస్ఎస్ఏ ద్వారా ఏర్పాటు చేస్తున్న ఆటిజం సెంటర్ను పరిశీలించారు. ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ సెంటర్లో ఎటువంటి సౌకర్యాలు కల్పించిందీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. తర్వాత ఉపాధ్యాయులతో సమావేశమైన కలెక్టర్.. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి అందరిలో కాకుండా ప్రత్యేకంగా పిలిపించుకుని, సున్నితంగా కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. వారిలో ఉండే సందేహాలను నివృత్తి చేయాలన్నారు. కలెక్టర్తో పాటు డీవైఈవో శేఖర్సింగ్, ఎంఈవో–1, 2 ఎన్. సలోమి, వైవీ హరనాథ్, పాఠశాల హెచ్ఎం ఎల్. ఇందిరా తదితరులు ఉన్నారు.
కలెక్టర్ డీకే బాలాజీ


