ఖమ్మంవ్యవసాయం: పీఎం కుసుమ్ పథకం కింద జిల్లాలో 55 సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసి 93.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళిక రూపొందించినట్లు ఖమ్మం ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. కల్లూరు మండలంలోని మిట్టపల్లి సబ్స్టేషన్ పరిధి, వైరా మండలంలోని జానకీపురం సబ్ స్టేషన్ పరిధిలో రెండేసి మెగా వాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ను ఎస్ఈ పర్యవేక్షణలో శనివారం గ్రిడ్కు అనుసంధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌర విద్యుత్ వ్యవస్థ ద్వారా పర్యావరణహిత విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుందని తెలిపారు. అంతేకాక అదనపు విద్యుత్ లభ్యత పెరిగి, స్థానికంగా విద్యుత్ సరఫరా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుతో రైతులకు 25ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం లభించనుందని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు పీఎం కుసుమ్ పథకం కింద ఐదు ప్లాంట్ల ద్వారా 9 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను గ్రిడ్కు అనుసంధానం చేశామని పేర్కొన్నారు. జిల్లాలోని సబ్ స్టేషన్ల సమీపాన ఉన్న ప్రభుత్వ భూములు సేకరించి సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే తిరుమలాయపాలెం, పెద్దగోపతి, తల్లాడ సబ్ స్టేషన్లో ఒక్కో మెగావాట్ విద్యుత్ ప్లాంట్ల పనులు చేపట్టామని తెలిపారు.
ఖమ్మం ఎస్ఈ శ్రీనివాసాచారి


