బోనకల్: ఎక్కడైనా భూవివాదాలు ఉన్నప్పటికీ భూముల రీసర్వే మాత్రం యథావిధిగా కొనసాగిస్తామని అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలో రీ సర్వేను ఆయన శనివారం పరిశీలించారు. ఈక్రమాన కొందరు రైతులు సర్వే నంబర్ల పరిధిలో వివాదాలు ఉన్నందున సర్వే నిలిపివేయాలని కోరగా, అదనపు కలెక్టర్ స్పందిస్తూ క్షేత్రస్థాయి సర్వేలో అభ్యంతరాలు ఉంటే చట్టపరంగా తేల్చుకోవాలని సూచించారు. అంతేతప్ప సర్వే ఆపేది లేదని, ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని తెలిపారు. సర్వే రికార్డులు, ప్రస్తుత స్థితికి తేడా ఉంటే డొంక వెడల్పు 33 అడుగులుగా హద్దులు నిర్ణయించి, రికార్డుల ప్రకారం కేటాయిస్తామని స్పష్టం చేశారు. అలాగే, కెనాల్ భూమిని ఎవరైనా కలిపి సాగు చేసుకుంటున్నా కొలతల ప్రకారం భూమి సంబంధిత శాఖ పరిధిలోకి వెళ్తుందన్నారు. ప్రస్తుతం ప్రాథమిక కొలతలు మాత్రమే(సేత్వార్ ప్రక్రియ) ఖరారు చేస్తుండగా, దీని ఆధారంగా కొత్త పాస్ పుస్తకాలు జారీ చేయబోమని తెలిపారు. కొలతలు పూర్తయ్యాక అభ్యంతరాల స్వీకరించి వాటిని పరిష్కరించాకే తుదిరికార్డులు సిద్ధమవుతాయని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుధాకర్, సర్వేయర్ రవి, ఆర్ఐ నర్సింహారావు, సిబ్బంది పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి


