నియోజకవర్గాల వారీగా నోటీసులు, విచారణ వివరాలు
అనామలీస్, అన్మ్యాపింగ్ ఓటర్లకు జారీ
జారీ అయిన 1,56,621 మందిలో విచారణకు 58,461 మందే..
సూచించిన తేదీన ధ్రువీకరణ
పత్రాలతో హాజరైతేనే ఓటు భద్రం
ఓటరు జాబితా ప్రత్యేక సవరణ(సర్)లో భాగంగా జిల్లాలోని అనామలీస్, అన్మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ జాబితాలో 1,75,841 మంది ఉండగా, ఇప్పటివరకు నోటీసులు అందుకున్న వారిలో చాలా మంది విచారణకు హాజరుకాలేదు. సరైన ధ్రువపత్రాలతో నిర్దేశిత తేదీన విచారణకు రావాలని, లేకపోతే ఓటు హక్కు కోల్పోయే అవకాశముందని అధికారులు సూచిస్తున్నారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం
అనామలీస్, అన్ మ్యాపింగ్ అయిన 1,75,841 మంది ఓటర్లకు నోటీసులు జారీ కానున్నాయి. ప్రస్తుత ఓటరు వివరాలు, వారి తల్లిదండ్రుల వివరాలు 2002 ఓటర్ల జాబితాలో అనుసంధానం కాకపోవడాన్ని అన్మ్యాపింగ్ జాబితాలో చేర్చారు. ఇక పేర్లు, ఇంటిపేర్లలో తేడాలు, అక్షర దోషాలు, వయస్సు తేడా ఉంటే అనామలీస్లో పెట్టారు. ఇలాంటి వారికి నోటీసులు జారీ చేస్తూ, ఎక్కడ తప్పు ఉంది, ఏయే పత్రాలతో ఎప్పుడు విచారణకు హాజరు కావాలో సూచిస్తున్నారు. ఈమేరకు ఓటర్లు అధికారులు సూచించిన రోజున విచారణకు హాజరు కావడంతోపాటు 11రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. అయితే, నోటీసులు అందుకున్న 1,56,621 మందిలో కేవలం 58,451 మందే విచారణకు హాజరయ్యారు. కాగా, నిర్దేశిత రోజు కుదరకపోతే మరో రోజైనా రావాలని, అయినా హాజరుకాకపోతే ఓటు హక్కు కాపాడుకునేందుకు అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది.
నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు వచ్చే సమయాన 11 రకాల ధ్రువీకరణ పత్రాల్లో ఏదైనా ఒకటి సమర్పించాలి. ఇందులో 10వ తరగతి మెమో, కుల ధ్రువీకరణ పత్రాలు ఉన్నాయి. కాగా, ఓటరుతో పాటు తల్లిదండ్రుల కుల ధ్రువీకరణ, ఇతర పత్రాలు లేకపోవడంతో దరఖాస్తు చేసుకోగానే త్వరగా జారీ చేసేలా తహసీల్దార్ కార్యాలయాలకు కలెక్టర్ దివాకర ఆదేశాలు ఇచ్చారు. ఈమేరకు ఓటర్లు ఈ పత్రాల కోసం తహసీల్దార్ కార్యాలయాల వద్ద క్యూ కడుతున్నారు.
హియరింగ్కు హాజరైన ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన ధ్రువపత్రాల్లో ఒకటి సమర్పిస్తే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ గుర్తింపు కార్డు, 1987 జూలై 1కి ముందు ప్రభుత్వ అధికారులు, బ్యాంక్, పోస్టాఫీస్, ఎల్ఐసీల జారీ చేసిన గుర్తింపు కార్డు / ధ్రువీకరణపత్రం / అధికారిక పత్రం, జనన ధ్రువీకరణ పత్రం, పాస్పోర్ట్, విద్యార్హత ధ్రువీకరణ పత్రం, శాశ్వత నివాస ధ్రువీకరణపత్రం, అటవీ హక్కుల ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం, జాతీయ పౌర పట్టిక, రాష్ట్ర / స్థానిక అధికారులచే తయారు చేయబడిన కుటుంబ రిజిస్టర్,. భూమి లేదా ఇంటి కేటాయింపు ధ్రువీకరణ పత్రం, 1987 జూలై 1ముందు జన్మించిన వారి పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. 1987 జూలై 1, 2004 డిసెంబర్ 2 మధ్య జన్మించిన వారైతే దరఖాస్తుదారుల సొంత పత్రంతోపాటు తల్లిదండ్రులలో ఒకరి పత్రం కూడా సమర్పించాలి. 2024 డిసెంబర్ 2తర్వాత జన్మించిన వారు తల్లిదండ్రులిద్దరి ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి.
జిల్లాలో 1,75,841 మందికి ‘సర్’ నోటీసులు


