నేడు ప్రత్యేక వనమహోత్సవం
1.75లక్షల మంది ఓటర్లకు నోటీసులు
గ్రీవెన్స్ డేలో కలెక్టర్ దివాకర
ఖమ్మం సహకారనగర్: ప్రజలు ఇచ్చే ప్రతీ ఫిర్యాదును పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. అధికారులను ఆదేశించారు. ప్రజావాణి (గ్రీవెన్స్ డే)లో భాగంగా కలెక్టరేట్లో సోమవారం ఆయన అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డిలతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఏవైనా తిరస్కరిస్తే అందుకు కారణాలను తెలియజేయాలని సూచించారు. జెడ్పీ సీఈఓ దీక్షారైనా, కలెక్టరేట్ ఏఓ కారుమంచి శ్రీనివాసరావు, హౌసింగ్ పీడీ భూక్యా శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రానికే మొగ్గు..
మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో గత సోమవారం నుంచి ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అయినా ఎక్కువ మంది అక్కడ కాకుండా కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వస్తున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులకు విన్నవించినా సమమ్యలు పరిష్కా రం కావనే భావనతో ఇక్కడకు వస్తున్నట్లు పలు వురు చెబుతున్నారు.
ఫిర్యాదుల్లో కొన్ని..
వేంనూరు మండలం లింగపాలెం ఎస్సీ కాలనీలో కొందరు ఇంటి నిర్మాణానికి రోడ్డుకిరువైపులా డ్రెయినేజీలు, బోర్లను పూడ్చిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. అలాగే, ఖమ్మం వైఎస్సార్ నగర్ కాలనీ వాసులు అంబేద్కర్ విగ్రహం పక్కనే సేవాలాల్ విగ్రహ ప్రతిష్టించే క్రమంలో గొడవలు జరగకుండా చూడాలని విన్నవించారు. ఇక బోనకల్ మండలం చొప్పకట్లపాలెం గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ స్థలం కబ్జా, అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలపై విచారణ చేపట్టాలని స్థానికులు వినతిపత్రం అందజేశారు.
గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
ఖమ్మంగాంధీచౌక్: జిలాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. తెలిపారు. ఉత్సవాల నిర్వహణపై పోలీస్ కమిషనర్ సునీల్దత్, అదనపు కలెక్టర్లు శ్రీజ, పి.శ్రీనివాసరెడ్డితో కలిసి ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో, ఇబ్బందులు లేకుండా జరిగేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రతీ మండపానికి అనుమతి, విద్యుత్ ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు, నిమజ్జనానికి అవసరమైన రూట్మ్యాప్, నీటి సరఫరా, ఇతర ఏర్పాట్లపై కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, వివిధ శాఖల అధికారులు రామ్మూర్తి, ఎన్.శ్రీనివాస్, దీక్షారైనా, శ్రీనివాసాచారి, వినోద్కుమార్, డాక్టర్ రామారావు, శ్రీనివాసరావు, జానయ్య, అజయ్కుమార్, స్తంభాద్రి ఉత్సవ సమితి అధ్యక్ష, కార్యదర్శులు వినోద్ లహోటి, కీసర జయపాల్రెడ్డితో పాటు జి.విద్యాసాగర్, కన్నం ప్రసన్నకష్ణ, అల్లిక అంజయ్య, ఎం.శ్రీహరి, డౌలే సాయికిరణ్ పాల్గొన్నారు.
ఖమ్మంవ్యవసాయం: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం వనమహోత్సవంలో భాగంగా భారీగా మొక్కలు నాటాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ దివాకర టీ.ఎస్., డీఎఫ్ఓ అనూజ్ అగర్వాల్ హాజరయ్యారు. మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు జియో ట్యాగింగ్ చేయాలని, సెప్టెంబర్ చివరి నాటికి లక్ష్యాన్ని చేరాలని సూచించారు. జిల్లా నుంచి కలెక్టర్ దివాకర మాట్లాడుతూ జిల్లాలో 31.30 లక్షల మొక్కలకు గాను 20.90 లక్షల మొక్కలు నాటగా 67 శాతం లక్ష్యం పూర్తయిందని తెలిపారు. ఇక మంగళవారం 2 లక్షలకు పైగా మొక్కలు నాటనున్నట్లు వెల్లడించారు. ఈసమావేశంలో అడిషనల్ డీఆర్డీఓ బి.శిరీష, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఖమ్మం సహకారనగర్: అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లకు నోటీసుల జారీ పకడ్బందీగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించాక అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి కలెక్టర్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో అనామలీస్, మ్యాపింగ్ కాని ఓటర్లు 1.75 లక్షల మందికి నోటీసులు జారీ చేసి అవసరమైన ఓటర్లను విచారణకు పిలవాలని తెలిపారు. ఈ సమయాన సమర్పించాల్సిన పత్రాలపై అవగాహన కల్పించాలని సూచించారు. కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్యాదవ్, ఆర్డీఓ ఎన్.శ్రీనివాస్, కలెక్టరేట్ ఉద్యోగులు ఎం.ఏ.రాజు, అన్సారీ పాల్గొన్నారు.


