ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా యాగశాలలో శ్రీవారికి అనుష్టానాలు, హోమాలు, పూర్ణాహుతి నిర్వహించాక పవిత్రాలను విసర్జన చేశారు. అలాగే, ఆలయ ప్రాంగణంలోని కోనేరులో శ్రీవారి విగ్రహాలకు ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మతో పాటు వేద పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా చక్రసాన్నం నిర్వహించారు. అంతేకాక స్వామి విగ్రహానికి పంచామృత అభిషేకం, స్వామి, అమ్మవార్ల నిత్యకల్యాణం జరిపించారు. ఆలయ ఈఓ జగన్మోహన్రావు, వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ఉద్యోగులు సోమయ్య, కృష్ణప్రసాద్, అర్చకులు పాల్గొన్నారు.
నేడు, రేపు మంత్రి తుమ్మల పర్యటన
ఖమ్మంఅర్బన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంగళ, బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు మంగళవారం సాయంత్రం ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్లో జరిగే వన మహోత్సవంలో మంత్రి పాల్గొంటారు. ఆతర్వాత జిల్లా ఆస్పత్రిలో 50 పడకలతో నిర్మించిన క్రిటికల్ కేర్ భవనాన్ని ప్రారంభిస్తారు. ఇక బుధవారం ఉదయం ఖమ్మం కవిరాజ్నగర్లో నూతన ఆధార్ సేవా కేంద్రాన్ని ప్రారంభించాక, రఘునాథపాలెం మండలం జింకలతండాలో స్వామి నారాయణ గురుకుల పాఠశాల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
గంజాయి నియంత్రణకు యాక్షన్ ప్లాన్
నేలకొండపల్లి: ఉమ్మడి జిల్లాలోకి ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి రాకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్ తెలిపారు. నేలకొండపల్లి ఎకై ్సజ్ సర్కిల్ కార్యాలయాన్ని సోమవారం తనిఖీ చేసిన ఆయన మాట్లాడారు. సరిహద్దు రాష్ట్రాల నుంచి ఉమ్మడి జిల్లాలోకి గంజాయి రాకుండా తని ఖీల కోసం భద్రాచలంలో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బృందాన్ని ఏర్పాటుచేశామన్నారు. ఉమ్మడి జిల్లాను సారా రహితంగా మార్చడం, బెల్ట్షాపుల నిర్మూలనతో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా చేయకుండా అంతర్ రాష్ట్ర చెక్పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. వైన్స్ల్లో మద్యాన్ని ఎమ్మార్పీకి మించి విక్రయించినా, నిబంధనలు పాటించకున్నా చర్యలు తప్పవని హెచ్చరించారు. నేలకొండపల్లి స్టేషన్ భవన పనుల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రూ.10 లక్షలు కేటాయించారని కిషన్ తెలిపారు. ఈసమావేశంలో ఇన్చార్జ్ సీఐ టి.లత, ఉద్యోగులు పాల్గొన్నారు.
ట్రైనింగ్, ప్రొడక్షన్ సెంటర్ ఏర్పాటుకు దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: మైనార్టీ మహిళలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను కమ్యూనిటీ ట్రైనింగ్, ప్రొడక్షన్ సెంటర్ ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి ముజాహిద్ తెలిపారు. మైనార్టీ, ముస్లిం ఎన్జీవోలు, బైతుల్మాల్ సంస్థల బాధ్యులు అర్హులు కాగా, మైనార్టీలు అధికంగా ఉన్న ప్రాంతంలో 240 చదరపు గజాల భూమి కలిగి ఉండాలని పేర్కొన్నారు. ప్రాజెక్టు రిపోర్టు, గత మూడేళ్ల నివేదికలు, వర్క్ ఆర్డర్ల విలువతో పాటు బ్యాంక్ స్టేట్మెంట్లు, ప్రత్యేక బ్యాంక్ ఖాతా, కమిటీ వివరాలు, ఫొటోలను దరఖాస్తుకు జత చేయాలని సూచించారు. అర్హత, ఆసక్తి ఉన్న సంస్థలు ఈనెల 31వ తేదీలోపు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో దరఖాస్తులు అందించాలని, వివరాలకు 97040 03002 నంబర్లో సంప్రదించాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.
బీఎల్ఏలు, సూపర్వైజర్లు అప్రమత్తంగా ఉండాలి
ఖమ్మంమయూరిసెంటర్: ప్రత్యేక ఓటర్ జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నందున అర్హులు ఓటు కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలు, సూపర్వైజర్లు పర్యవేక్షించాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్ సూచించారు. ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 65,276, పాలేరులో 40,698, మధిరలో 27,834, వైరాలో 22,101, సత్తుపల్లిలో 20,226 మందికి నోటీసులు ఇవ్వనున్నారని తెలిపారు. ఈమేరకు నోటీస్పై ఓటర్లకు అవగాహన కల్పిస్తూ అవసరమైన ధ్రువపత్రాలు అందించేలా చూడాలని సూచించారు.


