ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మం త్రీటౌన్ ప్రాంతానికి చెందిన పలు వృత్తుల్లో కొనసాగుతున్న స్నేహితులు 30 ఏళ్ల క్రితం శ్రీ స్తంభాద్రి సేవా సమితిని ఏర్పాటు చేశారు. ఈ సమితి ద్వారా పరస్పర సహకారాలు అందించుకోవడమేకాక సమాజహితం కోసం కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పేద పిల్లలకు నోట్బుక్స్ పంపిణీ, ఉన్నత చదువులకు వెళ్లే పేద విద్యార్థులకు ఆర్థిక సాయం చేస్తున్నారు. అలాగే, బధిర విద్యార్థులకు నిత్యావసరాలు అందిస్తున్నారు. ఖమ్మంరూరల్ మండలం మంగళగూడెం హైస్కూల్ విద్యార్థులకు నోట్బుక్స్, పరీక్షల సామగ్రి, అంగన్వాడీ కేంద్రాల్లో మంచినీటి ఫిల్టర్లు అందించారు. ఓ దుకాణంలో గుమస్తాగా పనిచేస్తున్న హరిప్రసాద్ ఇద్దరు కూతుళ్ల చదువులకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు. గోశాలలకు దాణా, వరిగడ్డి కూడా అందిస్తున్నారు. ఈ బృందంలో తూములూరి లక్ష్మీనరసింహారావు, పల్లా లింగయ్య, సూరినేటి మల్లేశం, దేవరశెట్టి రామారావు, పెనుగొండ సాయికుమార్, మోతుకూరి భద్రయ్య, సుంకరి యల్లారావు, జి.సూర్యనారాయణ, జంగిలి రమణ, వంగవీటి నవీన్ తదితరులు ఉన్నారు.


