దుమ్ముగూడెం: నాలుగు దశాబ్దాలుగా చెక్కుచెదరని స్నేహ బంధాన్ని కొనసాగిస్తున్నారు మండల వాసులు ఇద్దరు. ప్రైవేట్ బస్సు కండక్టర్లుగా మొదలైన వారి పరిచయం ప్రభుత్వ ఉద్యోగంలోనూ, ఆ తర్వాత వ్యాపార రంగంలోనూ కొనసాగుతోంది. దుమ్ముగూడెం మండలం లక్ష్మీనగరం గ్రామానికి చెందిన వాకచర్ల గౌరీశంకర్, భద్రాచలానికి చెందిన సారథి రమేశ్ 1984లో నాటి ప్రైవేట్ బస్సులో కండక్టర్లుగా పని చేస్తుండగా మొదలైన పరిచయం స్నేహంగా మారింది. ఆపై 1988లో ఆర్టీసీలో కండక్టర్లుగా ఇద్దరూ ఉద్యోగాలు సాధించారు. గౌరీశంకర్ 1999లో ఉద్యోగాన్ని వదులుకుని వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఇక మిత్రుడి బాటలోనే రమేశ్ సైతం 2002లో ఉద్యోగాన్ని వీడి వ్యాపారంలో ప్రవేశించారు. ఉద్యోగాలు మారినా, వ్యాపారాల్లో బిజీగా ఉన్నా 1984లో మొదలైన వీరి స్నేహం ఇప్పటికీ అంతే బలంగా కొనసాగుతోంది.


