ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈనెల 23, 24 తేదీల్లో ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 23న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు సత్తుపల్లిలోని జేవీఆర్ ఓపెన్ కాస్ట్ గనులకు చేరుకోనున్న ఆయన బొగ్గు ఉత్పత్తి, నాణ్యతను పరిశీలించాక అధికారులతో సమావేశమవుతారు. ఆతర్వాత కొత్తగూడెం చేరుకుని టీజీ జెన్కో, సింగరేణి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి బస చేస్తారు. ఇక 24వ తేదీ శుక్రవారం ఉదయం మణుగూరు వెళ్లి బీటీపీఎస్ వద్ద టీజీ జెన్కో ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన డీఏఓ పబ్లిక్ స్కూల్ను ప్రారంభిస్తారు. ఆతర్వాత మణుగూరు ఓపెన్ కాస్ట్, అండర్ గ్రౌండ్ గనులను పరిశీలించి బొగ్గు ఉత్పత్తి, నాణ్యతపై అధికారులతో చర్చిస్తారు.
స్వయం ఉపాధి పథకాల
దరఖాస్తు గడువు పొడిగింపు
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర క్రిస్టియన్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే గడువును ఈనెల 31 వరకు పొడిగించినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ముహ్మద్ ముజాహిద్ తెలిపారు. అర్హులైన క్రిస్టియన్, మైనార్టీలు కుట్టు మిషన్, చిరువ్యాపారాలు, ఈ–బైక్, ఈ–స్కూటీ, మోటార్ బైక్ కోసం tgobmms. cgg. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల వారైతే వార్షికాదాయంరూ.2 లక్షల లోపు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు అర్హులని తెలిపారు. కుట్టు మిషన్, చిరువ్యాపారానికి 21 – 55 ఏళ్లు, ఈ–బైక్, స్కూటీ, మోటార్ బైక్ కోసం 21 – 50 ఏళ్ల వయస్సు వారు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 97040 03002 నంబర్లో సంప్రదించాలని అధికారి సూచించారు.
అకాడమీలో
ప్రవేశానికి పోటీలు
ఖమ్మం స్పోర్ట్స్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యాన ఖమ్మం అథ్లెటిక్స్ అకాడమీలో ప్రవేశాలకు సోమవారం పోటీలు నిర్వహించారు. సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగిన పోటీలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల అథ్లెట్లు హాజరయ్యారు. వీరికి స్టాండింగ్ బ్రాడ్ జంప్, వర్టికల్ జంప్, 600 మీటర్ల పరుగు, 30 మీటర్ల షటిల్ రన్ పోటీలు నిర్వహించారు. తొలిదశ పోటీలు పూర్తికాగా, రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించాక ఎంపికై న వారి జాబితా విడుదల అవుతుందని నిర్వాహకులు తెలిపారు. పోటీలను డీవైఎస్ఓ టి.సునీల్రెడ్డి పర్యవేక్షించగా, కోచ్లు, అసోసియేషన్ ప్రతినిధులు ఎం.శ్రీనివాసరావు, ఎం.డీ.గౌస్, నున్నా రాధాకృష్ణ, ఎం.డీ.షఫీక్ అహ్మద్, తదితరులు పాల్గొన్నారు.
‘నవోదయ’లో ప్రవేశానికి దరఖాస్తులు
ఖమ్మం సహకారనగర్: జవహర్ నవోదయ విద్యాలయలో వచ్చే విద్యాసంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ సదానందం తెలిపారు. ప్రస్తుతం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈనెల 31వ తేదీ వరకు www. navodaya. gov. in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. విద్యార్థులకు ఈ ఏడాది నవంబర్ 28వ తేదీన ప్రవేశపరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తారని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 5వ తరగతి విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ ఓ ప్రకటనలో సూచించారు.
నవోదయలో నేటి నుండి రీజినల్ స్థాయి యోగా పోటీలు
కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో బుధవారం నుంచి మూడు రోజుల పాటు రీజినల్ స్థాయి యోగా పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల్లో రీజియన్ పరిధిలోని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన 288 మంది బాలబాలికలు హాజరవుతారని ఇన్చార్జి ప్రిన్సిపాల్ వెంకటరమణ తెలిపారు. ఇక్కడ విజేతలుగా నిలిచే వారిని ఆగస్టు 30నుంచి పంజాబ్ రాష్ట్రంలోని హోషియార్పూర్ జిల్లా నవోదయ విద్యాలయలో జరిగే జాతీయ స్థాయి యోగా పోటీలకు ఎంపిక చేస్తారని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో రీజినల్ స్థాయి క్రీడాపోటీలు నిర్వహిస్తుండగా పాలేరు విద్యాలయ యోగా పోటీలకు వేదికగా ఎంపి కైంది. పలు ఆంతాల విద్యార్థులు మంగళవారం సాయంత్రానికి చేరుకున్నారు.


