భద్రాచలం: భద్రాచలంలో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఈక్రమాన చిత్రకూట మండపాన్ని తొలగించే పనులు మొదలయ్యాయి. మండపంలోని శిల్పాకళా స్తంభాలను కొత్తగా నిర్మించే మండపంలో తిరిగి ఏర్పాటుచేసేలా భద్రపర్చనున్నారు. ఇందు కోసం ఒక్కో భాగానికి నంబర్లు వేస్తూ జాగ్రత్తగా తొలగిస్తున్నారు.
45 ఏళ్లుగా అనేక ఉత్సవాలకు సాక్షం
భద్రాచల సీతారామాలయ ఉద్దరణ సంఘం ఆధ్వర్యంలో నాటి ఉప ప్రధాని మొరార్జీ దేశాయ్ చేతుల మీదుగా 1967 జూలై 15న చిత్రకూట మండపానికి శంకుస్థాపన చేయగా 1982 ఏప్రిల్ 4న అప్పటి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పీవీ.చౌదరి ప్రారంభించారు. అప్పటి నుంచి అనేక ఉత్సవాలకు సాక్షిగా నిలిచింది. తొలుత శ్రీరామనవమి, భక్త రామదాసు జయంతి ఉత్సవాలు నిర్వహించగా, ఇప్పుడు రద్దీ సమయాన నిత్యకల్యాణాలు నిర్వహిస్తున్నారు.


