ప్రమాదమా, ఆత్మహత్యా?
సత్తుపల్లి(పెనుబల్లి): పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి వద్ద ఆర్టీసీ బస్సు వెనక టైర్ల కింద పడిన ఓ వ్యక్తి మృతి చెందాడు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తల్లాడ మండలం రామా నుజవరానికి చెందిన జంగం రత్నాకర్ (31) సత్తుపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఖమ్మం నుంచి సత్తుపల్లి వైపు వస్తుండగా కొత్త లంకపల్లి వద్ద బస్సు కింద పడేందుకు ప్రయత్నించాడు. దీంతో డ్రైవర్ అప్రమత్తమై డివైడర్ ఎక్కించాడు. అయినా రత్నాకర్ మళ్లీ బస్సు వెనుక టైర్ల కింద పడడంతో తీవ్రగాయాలై మృతి చెందాడు. స్తానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే, రత్నాకర్ అనారోగ్య కారణాలతో సత్తుపల్లి ప్రభు త్వాస్పత్రిలో కొన్నాళ్ల నుంచి చికిత్స పొందుతున్నాడని తెలిసింది. ఆయన చేతికి సైలెన్ పెట్టే క్యాన్లా ఉండడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ప్రమాదమా? అన్నది తెలియాల్సి ఉంది. కాగా, రత్నాకర్కు భార్య, ఓ కుమారుడు ఉన్నారు.
ఆగి ఉన్న లారీని ఢీకొని వాహనదారుడు..
తిరుమలాయపాలెం: మండలంలోని దమ్మాయిగూడెం సమీపాన బ్రిక్స్ ఫ్యాక్టరీ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. గురువారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన జోగా సతీశ్ (33) బతుకుదెరువు కోసం ఖమ్మం రూరల్ మండలం శ్రీసిటీలో ఉంటూ మరిపెడ బంగ్లాలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి ఆయన మరిపెడ నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తుండగా, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టగా తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు సాయంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య అంజమ్మతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎలాంటి హెచ్చరిక బోర్డు లేకుండా, జాగ్రత్తలు పాటించకుండా రోడ్డుపై లారీ నిలపడంతోనే ఈ ప్రమాదం జరిగిందని సతీశ్ తండ్రి కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుతో లారీడ్రైవర్ లింగంపల్లి మురళీధర్పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కూచిపూడి జగదీశ్ తెలిపారు.


