ప్రభుత్వ ఆధ్వర్యంలో కూలీలకు
పనుల కల్పనపై ప్రణాళిక
‘ప్రగతి ప్రణాళిక’లో
జల సంరక్షణకు ప్రాధాన్యత
గ్రామ సభల్లో జల ప్రతిజ్ఞ..
పనులపై లక్ష్యాలు ఖరారు
రోజుకు 17 వేల మంది..
జిల్లాపై ఎల్నినో పంజా విసురుతోంది. వానలు ముఖం చాటేయడం, ఎండలు మండుతుండడంతో వ్యవసాయ పనులు చురుగ్గా సాగడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతుండగా.. కూలీలకు పనులు దొరకడం కష్టమైంది. ఈ నేపథ్యాన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఉపాధి హామీ (వీబీజీ రామ్జీ) పథకాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని జల సంరక్షణ పనులను ముమ్మరం చేయాలని సర్కార్ నిర్ణయించింది. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 17 వేల మందికి పైగా కూలీలు పనులకు వస్తుండగా, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య భారీగా పెరుగుతుందని భావిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
వీబీజీ రామ్జీ ఇలా..
జిల్లాలో
జాబ్కార్డులు
2,92,468
పని పొందిన కుటుంబాలు
పనిచేసిన కూలీలు
1,70,689
కూలీల సంఖ్య
6,07,836
జలసంరక్షణ.. ఉపాధి
పనులు లేక ఇబ్బంది పడుతున్న కూలీలను ఆదుకోవడం.. ఇంకోపక్క రైతులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. భవిష్యత్ తరాలకు నీటి భద్రత, భూగర్భ జలాల పెంపుదల, సుస్థిర జల నిర్వహణే లక్ష్యంగా ‘జల్ సంచయ్ జన భాగీదారి’ నినాదంతో ఉపాధి పనులపై గ్రామసభల్లో చర్చించేలా అజెండా చేర్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత, ప్రజల భాగస్వామ్యం, తక్కువ వ్యయం ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో శాసీ్త్రయంగా నీటి సంరక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ప్రభుత్వ నిధులే కాకుండా స్వచ్ఛంద సంస్థలు, నాబార్డ్, సింగరేణి వంటి సంస్థల కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులను సైతం ఇందుకోసం సమీకరిస్తున్నారు.
ప్రతీ గ్రామంలో చెక్డ్యామ్
ఏటా వ్యవసాయ సీజన్ ముగిశాక వేసవిలో చేపట్టే ఉపాధి పనులతో కూలీలకు ఉపాధి లభిస్తుంది. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ అయినా ఎల్నినో ప్రభావం కారణంగా కూలీలకు పనులు లేకపోవడంతో ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం ‘జల్ సంచయ్ జన భాగీదారి’ ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద జిల్లాలోని ప్రతీ గ్రామపంచాయతీలో 200 ఇంకుడు గుంతలు, రైతులకు మేలు జరిగేలా ప్రతీ గ్రామంలో కనీసం 50 ఫామ్ పాండ్స్, కనీసం ఒక చెక్డ్యామ్ నిర్మించేందుకు నిర్ణయించారు. అంతేకాక వైరా, సత్తుపల్లి, కామేపల్లికి మండలానికి సరిహద్దుల్లో గుట్టలు ఉన్న ప్రాంతాల్లో ఎత్తు నుంచి కిందకు నీరు ప్రవహించేలా కొండ వాలుల్లో కందకాలు తవ్వడం, గతంలో నిర్మించిన జల సంరక్షణ పనుల నిర్వహణ, మరమ్మతులకు సిద్ధమవుతున్నారు.
స్ఫూర్తి నిండుగా.. లక్ష్యం దిశగా..
జల సంరక్షణలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం రికార్డు స్థాయిలో 5.61 లక్షల నీటి సంరక్షణ నిర్మాణాలను పూర్తి చేసి దేశంలోనే ప్రథమ స్థానాన్ని కై వసం చేసుకుంది. ఈ కృషికి గాను రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు కేంద్రం నుంచి రూ. 2 కోట్ల మేర నగదు ప్రోత్సాహకాలు లభించాయి. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ కింద భారీగా నీటి సంరక్షణ, వర్షపు నీటి రీచార్జ్ నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకుని కేంద్ర జలశక్తి పోర్టల్లో నమోదు చేశారు. పనుల గుర్తింపు కోసం నిర్వహించే గ్రామసభల్లో ప్రజల్లో బాధ్యత పెంచేలా ‘జల సంరక్షణ – మన సంరక్షణ’ పేరుతో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయిస్తున్నారు.
వర్షాభావంతో ముందుకు సాగని వ్యవసాయం
ఉపాధి పథకం కింద చేపడుతున్న జల సంరక్షణ పనులకు ప్రస్తుతం కూలీలు ఎక్కువగా హాజరవుతున్నారు. 2025–26 ఆర్ధిక సంవత్సరం జూన్లో 3,99,334 మంది కూలీలు హాజరైతే... ఈ జూన్లో 10,45,333 మంది హాజరుకావడం పనుల కొరతను తెలియచేస్తోంది. సహజంగా జూలైలో అత్యధిక వర్షాలు కురిసి వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతుంటాయి. ఈ నేపథ్యాన ఉపాధి పనుల అవసరం కూలీలకు ఉండదు. కానీ ఈసారి పరిస్థితి అందుకు భిన్నంగా ఉండడంతో ఉపాధి పనులకు రోజుకు 17 వేల మంది చొప్పున హాజరవుతున్నారు. అంటే జూలై ముగిసే వరకు 5.10 లక్షల మంది పని చేసినట్లవుతుంది. ఈక్రమాన కూలీలను ఉపాధి పనులు ఆదుకుంటుండగా.. రైతుల కోసం భూగర్భ జలాలు పెంచేందుకు ‘జల్ సంచయ్ జన భాగీదారి’ పథకం దారి చూపినట్లు అవుతుంది.


