ప్రత్యామ్నాయ పంటలపై
రైతుల్లో అవగాహన
కలెక్టర్ దివాకర టీ.ఎస్.
ఖమ్మంవ్యవసాయం: వ్యవసాయ క్షేత్రాల్లో ఫామ్ పాండ్ల ఏర్పాటుతో పాటు నీటి సంరక్షణ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని కలెక్టర్ దివాకర టీ.ఎస్. ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం ఆయన అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి వ్యవసాయ, ఉద్యానవన, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఫామ్ పాండ్లు, నీటి సంరక్షణ, పంటల సాగు విధానాలపై సమీక్షించాక కలెక్టర్ మాట్లాడుతూ.. తక్కువ వర్షపాతం నమోదవుతున్నందున భూగర్భ జలాల పెంపునకు దోహదపడే ప్రతీ కార్యక్రమాన్ని ప్రాధాన్యతతో అమలు చేయాలని సూచించారు. ఫామ్ పాండ్లు భూగర్భ జలాల పెరుగుదలకు, రైతుల సాగునీటి అవసరాలకు ఉపయోగపడతాయనే అంశంపై అవగాహన కల్పించాలని తెలిపారు. జూలై నెలాఖరులోగా లబ్ధిదారుల గుర్తింపు జరగాలని చెప్పారు. ఇక పత్తిలో మిశ్రమ పంటలు, అంతర పంటల సాగు, ఎల్నినో కారణంగా తక్కువ నీరు అవసరమయ్యే స్వల్పకాలిక పంటలే సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ఆదేశించారు. ఈ విషయమై వాట్సాప్ గ్రూపులు, సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్ బి.సరిత, ఉద్యానవన అధికారి అనిత పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
యుద్ధ ప్రాతిపదికన రిటైనింగ్ వాల్
ఖమ్మంఅర్బన్: మున్నేటి వెంట రిటైనింగ్ వాల్ నిర్మాణంలో వేగం పెంచి గడువులో పూర్తయ్యేలా పర్యవేక్షించాలని కలెక్టర్ దివాకర సూచించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణం, భూసేకరణ, డ్రెయినేజీల డిజైన్పై అధికారులతో సమీక్షించిన ఆయన మాట్లాడుతూ.. పలు సూచనలు చేశారు. భూసేకరణ వేగంగా జరిగేలా భూ యజమానులతో చర్చించాలని తెలిపారు. జల వనరుల శాఖ చీఫ్ ఇంజనీర్ ఎం.వెంకటేశ్వర్లు, ఆర్డీఓ ఎన్.శ్రీనివాస్, పలు శాఖల అధికారులు బాబూరావు, శ్రీనివాస్రెడ్డి, ఉదయ్ప్రతాప్, వాణిశ్రీ, మహేశ్బాబు పాల్గొన్నారు.


