ఖమ్మంక్రైం: పోక్సో కేసుల్లో దర్యాప్తు వేగంగా చేపట్టి గడువులోగా కోర్టుల్లో చార్జిషీట్లు దాఖలు చేయాలని పోలీసు కమిషనర్ సునీల్దత్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన నేరసమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నిందితులకు శిక్షల శాతం పెరగడమే లక్ష్యంగా దర్యాప్తు, శాసీ్త్రయ ఆధారాల సేకరణ ఉండాలని తెలిపారు. కొత్త చట్టాల ప్రకారం గడువులోగా ట్రయల్ పూర్తి చేయాలని, సాక్షులు కోర్టుకు హాజరయ్యేలా భరోసా కల్పించాలని తెలిపారు. ఇక ఎన్టీపీఎస్ కేసుల్లో నేరాన్ని రుజువు చేయడానికి గంజాయి, మాదకద్రవ్యాల స్వభావం, పరిమాణంపై ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ నివేదిక సమర్పించాలని సూచించారు. జిల్లా మీదుగా గంజాయి రవాణా, విక్రయాలను ఆరికట్టడానికి ఈగల్ బృందాలు, టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సీపీ తెలిపారు. నిఘా వ్యవస్దను బలోపేతం చేస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, చోరీ కేసుల్లో రికవరీ చేసిన సొత్తును బాధితులకు అప్పగించడంలో సాంకేతికతను ఉపయోగించాలని చెప్పారు. నేరాలు జరిగాక స్పందించడం కంటే ముందస్తు చర్యల కోసం సమర్థవంతమైన పోలీసింగ్ నిర్వహించాలని సీపీ సూచించారు. కాగా, రోడ్డు ప్రమాదాల ఎక్కువగా జరిగే హాట్ స్పాట్ల వద్ద సరైన భద్రతా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ రామానుజం, ఏసీపీలు వసుంధర యాదవ్, రమణమూర్తి, తిరుపతిరెడ్డి, సారంగపాణి, ఫణీందర్, నర్సింహరావు, సర్వర్, సత్యనారాయణ, సాంబరాజు పాల్గొన్నారు.
పోలీసు కమిషనర్ సునీల్దత్


