
కోడ్లు వద్దు.. ఎనిమిది గంటలే మేలు
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రం అమల్లోకి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగించాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం డిమాండ్ చేశారు. సీపీఎం ఖమ్మం త్రీటౌన్ కమిటీ ఆధ్వర్యాన గురువారం మే డే సందర్భంగా స్థానిక బోస్ సెంటర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్మిక సంక్షేమానికి తూట్లు పొడిచేలా చట్టాలు తెస్తే కార్మిక వర్గం మొత్తం తిరగబడుతుందని హెచ్చరించారు. పెట్టుబడిదారి వర్గాలతో బీజేపీ ప్రభుత్వం కుమ్మకై 44 చట్టాలుగా ఉన్న కార్మిక చట్టాలను కుదించి నాలుగు కోడ్లుగా మార్చిందని ఆరోపించారు. ఇకనైనా కోడ్లను రద్దుచేయాలని.. లేనిపక్షంలో తిరుగుబాటు తప్పదని తెలిపారు. ఈవిషయమై 25వ తేదీన జరిగే దేశ వ్యాప్త సమ్మెలో కార్మిక లోకం పాల్గొనాలని తమ్మినేని పిలుపునిచ్చారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సాయిబాబా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు వై.విక్రమ్, బి.శ్రీనివాస్, యర్రా శ్రీని వాసరావు తదితరులు పాల్గొన్నారు.
మే డే సభలో తమ్మినేని వీరభద్రం