ప్రజల్లో ఉండేవారికే ప్రాధాన్యత
● గెలుపు గుర్రాలకే మున్సిపల్ ఎన్నికల్లో బీ–ఫామ్ ● సన్నాహక సమావేశంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మంమయూరిసెంటర్: కటౌట్లు పెట్టినంత మాత్రాన టికెట్లు రావని, ఎవరైతే ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతారో, ఎవరికి క్షేత్రస్థాయిలో ప్రజల ఆశీస్సులు ఉంటాయో వారికే మున్సిపల్ ఎన్నికల్లో బీ–ఫామ్ అందుతుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం ఖమ్మంలో మంగళవారం రాత్రి జరగగా మంత్రి మాట్లాడారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల సమరానికి కాంగ్రెస్ శ్రేణులు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. గెలిచే వారికే ప్రాధాన్యత ఉంటుందని, తన రక్త సంబంధీకులైనా సరే ప్రజల మద్దతు ఉంటేనే టికెట్ వస్తుందని పొంగులేటి తెలిపారు. ఏదులాపురంలోని 32 వార్డుల్లోనూ విజయం సాధించడమే లక్ష్యంగా శ్రేణులు సిద్ధం కావాలని సూచించారు. ప్రభుత్వం గడిచిన రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఓటర్లకు వివరించాలని తెలిపారు. ఏదులాపురం పరిధిలో ఒక్క ఉపాధి హామీ పథకంతోనే రూ.100 కోట్ల నిధులు వచ్చాయని, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రతీ ఇంటికీ చేరాయని చెప్పారు. చేసిన పనులను సోషల్ మీడియా ద్వారా, వ్యక్తిగత ప్రచారం ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. అంతేకాక వార్డుల్లో పెండింగ్ ఉన్న చిన్నచిన్న సమస్యల జాబితా అధికారులకు ఇస్తే, ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపే పూర్తి చేసేలా నిధులు మంజూరు చేస్తానని భరోసా ఇచ్చారు. ఇళ్ల స్థలాల విషయంలో పేదలకు అన్యాయం జరగకుండా నాయకులు పర్యవేక్షించాలని మంత్రి సూచించారు. ఈ సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, నాయకులు తుంబూరు దయాకర్రెడ్డి, చావా శివరామకృష్ణ, బేబీ స్వర్ణకుమారి, దొబ్బల సౌజన్య, హరినాథ్బాబు తదితరులు పాల్గొన్నారు.


