బళ్లారిఅర్బన్: వచనకారులు సమాజంలో మానవత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను పెంపొందించేందుకు తమ వచనాల ద్వారా చేసిన కృషి అపారం అని కసాప నేత నిష్టి రుద్రప్ప అన్నారు. నేతాజీ నగర్ గణేష్ దేవస్థానంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 12వ శతాబ్దం వచనకారుల యుగం తెలిపారు. కులం, మతం, వర్ణం, లింగ, సామాజిక తారతమ్య భేదం లేకుండా చక్కటి సందేశాలను అందించారన్నారు. కాంగ్రెస్ ప్రముఖులు ఎల్.మారెప్ప, గాయకులు కే.తిమ్మప్ప, రాఘవేంద్ర గుడదూరు, విజయేంద్ర క్షత్రియ, గణేష్ అభయ్ కసాప, దొడ్డ బసవ గవాయి చక్కగా వచన గీతాలను పాడారు. వీరికి తబలాపై విరుపాక్షప్ప, కీప్యాడ్పై తిప్పేస్వామి సహకరించారు. దాతలు అక్కి మల్లికార్జున అందరిని సన్మానించారు. టీ.తిమ్మప్ప, నాగరెడ్డి, బీ.శ్రీధర్, శరణ బసవ పాల్గొన్నారు.
టేబుల్ టెన్నిస్లో మూడో స్థానం
రాయచూరు రూరల్: బళ్లారిలో ఆదివారం జరిగిన రాష్ట్ర స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో వివేకానంద మూడో స్థానంలో నిలిచి వెండి పతకం సాధించాడు. టేబుల్ టెన్నిస్ అకాడమీ అధ్యక్షుడు బసవరాజ్ పాటిల్, నందాపూర్ శ్రీనివాస్, లక్ష్మి నారాయణ, శిక్షకుడు వీరణ్ణ వివేకానందను అభినందించారు.
పర్యాటక రంగంలో పురస్కారాలు అందజేస్తాం
బనశంకరి: పర్యాటక రంగంలోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన సంస్థలు, పారిశ్రామికవేత్తలు, వ్యక్తులను గుర్తించి కర్ణాటక టూరిజం అవార్డులు ప్రదానం చేస్తామని ఇంధన, టూరిజం శాఖ మంత్రి కేజే.జార్జ్ తెలిపారు. రాష్ట్రంలో వన్స్టేట్ మెనీవరల్డ్స్ బ్య్రాండ్ పేరుతో పురస్కారాలను అందజేస్తామన్నారు. కర్ణాటక టూరిజం సొసైటీ అధ్యక్షుడు కే.శ్యామరాజు మాట్లాడుతూ పర్యాటక ఆతిథ్య రంగంలో ఉత్తమసేవలు అందిస్తున్న వారికి గుర్తింపు ఇవ్వడంతోపాటు సేవా నాణ్యతను పెంచడం కోసం ఐదు విభాగాల్లో 35 పురస్కారాలు అందిస్తారని అన్నారు.


