బనశంకరి: కావేరి జలాల విషయంలో కన్నడనాడుకు ఎదురుగాలి వీస్తూనే ఉంది. తమిళనాడుకు కావేరి నదీ జలాలను ప్రతిరోజు 6 వేల క్యూసెక్కులను 15 రోజలు పాటు విడుదల చేయాలని సీడబ్ల్యూఆర్సీ కర్ణాటకకు సిఫార్సు చేసింది. అంటే మొత్తం 7.8 టీఎంసీలను వదలాలి. తీవ్రమైన కరువు ఏర్పడిన సమయంలో మరోసారి నీటి విడుదల ఆదేశాలు అటు సర్కారుతో పాటు రైతాంగానికి తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో కబిని, కేఆర్ఎస్ సహా నాలుగు డ్యాముల్లో ఇన్ఫ్లో గణనీయంగా క్షీణించింది. ఇది 3వ దఫా నీటి విడుదల ఆదేశం.
రాష్ట్ర ప్రజలకు ద్రోహం
మైసూరు: రాష్ట్రంలో కరువు సంభవించి ప్రజలకు, పశువులకు తాగునీటి సమస్య ఉన్నందున తమిళనాడుకు కావేరి నీటి విడుదలను వెంటనే ఆపాలని రైతు సంఘం రాష్ట్రాధ్యక్షుడు బడగలపుర నాగేంద్ర డిమాండ్ చేశారు. ఆయన జిల్లా పత్రికాభవనంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో గతంలో ఎన్నడూ చూడనంతగా కరువుతో మంచినీటికి కూడా ప్రజలు తిప్పలు పడుతున్న సందర్భంలోనూ తమిళనాడుకు నీటిని వదలడం సరికాదన్నారు. ఇది రాష్ట్ర ప్రజలకు చేస్తున్న ద్రోహమని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే రాజకీయ నిర్ణయాన్ని తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
7.8 టీఎంసీలు ఇవ్వాలని
సీడబ్ల్యూఆర్సీ ఆదేశం


