హుబ్లీ: కరువు ప్రాంతాల ప్రకటన విషయంలో విజయపుర జిల్లా ఇన్చార్జి మంత్రి ఎంబీ పాటిల్, ముద్దేబిహాళ ఎమ్మెల్యే సీఎస్ నాడగౌడల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుంది. ముద్దేబిహాళ, తాళికోటె పేర్లను కరువు పీడిత తాలూకాల జాబితాలో ప్రకటించక పోవడానికి కారణం ఎంబీ పాటిలే అంటూ ఎమ్మెల్యే నాడగౌడ తీవ్ర ఆరోపణలు చేశారు. స్వపక్ష ఎమ్మెల్యే వ్యాఖ్యల మేరకు మంత్రి ఎంబీ పాటిల్ ప్రకటన చేశారని, అన్ని తాలూకాలను కరువు పీడిత ప్రాంతాలుగా ప్రకటించాలని ప్రభుత్వానికి లేఖ రాశానన్నారు. అనవసరంగా ఆరోపణలు చేయడం సరికాదని ఆయన ఆ ఆరోపణలను తిప్పికొట్టారు. తాను ఆయా నియోజకవర్గాలకు కరువు అధ్యయనానికి వెళ్లినప్పుడు నేను బెంగళూరు, ఢిల్లీలో ఉన్నానని సాకు చెప్పారు. తమకు అన్యాయం జరిగితే రెవెన్యూ మంత్రిని, సీఎంను కలిసి చర్చించాలి. అయితే నియోజకవర్గ ప్రజలను వంచించడానికి నాటకం అడుతున్నారని ఎంబీ పాటిల్ తన లేఖలో నాడగౌడపై మండిపడ్డారు. ఆ ఎమ్మెల్యే ఇటీవల ప్రభుత్వంపై, హైకమాండ్పై, తనపై నిరంతరంగా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తనను సహనంతో నడుచుకోవాలని హైకమాండ్ సూచించిందన్నారు. తన సహనాన్ని బలహీనతగా కొందరు భావిస్తున్నారు. ముద్దేబిహాళ్ ఎమ్మెల్యే వయోసహజ మానసిక వ్యాధితో బాధపడుతున్నారు. ఆయనకు సరైన చికిత్స అవసరం. ఇకపై దిగజారుడు వ్యాఖ్యలు కొనసాగిస్తే ఆయన మనోవ్యాధికి చికిత్సే సరైన పరిష్కారం అని ఎంబీ పాటిల్ కాసింత ఆగ్రహంగా ఎమ్మెల్యే నాడగౌడపై చిందులు తొక్కారు.


