● ముఖం చాటేసిన వరుణుడు
● వర్షాభావంతో
ఎండుముఖం పడుతున్న పంటలు
బళ్లారి అర్బన్: ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నెలకొంది. సకాలంలో వర్షాలు కురవక పోవడంతో పంటలు ఎండుముఖం పడుతున్నాయి.
వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశించి పెట్టుబడులు పెట్టి పంటలు సాగు చేసిన రైతులకు నిరాశే మిగిలింది. వరుణుడు ముఖం చాటేడయంతో చెరువు, కుంటలు, వాగులు ఎండిపోయాయి. భూగర్భ జలవనరులు గణనీయంగా పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు బావులపై ఆధారపడిన రైతులకు సాగు నీటి కష్టాలు మరింత పెరిగాయి. గతంతో నీటితో కళకళలాడిన చెరువు, గుంటలు ప్రస్తుతం వటిపోయాయి. వర్షాలు కురవక పోతే పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. విత్తనాలు ఎరువులు, పురుగు మందులు, కూలీల కోసం ఇప్పటికే పెద్ద మొత్తం ఖర్చు చేసిన రైతులు పంట చేతికందుతోందో లేదని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే గ్రామీణ ప్రాంతాల్లో పంటల పరిస్థితిని క్షేత్ర స్థాయిలో పరిశీలించి సాగు నీటి సౌకర్యం కల్పించాలని రైతులు కోరుతున్నారు. సర్వే నిర్వహించి అర్హులైన రైతులకు నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల తుంగభద్ర జలాశయం కింద ఉన్న హెచ్ఎల్సీ ఎల్ఎల్సీ కాలువలకు నీరు వదలడంతో ఆయకట్టు రైతులతో కొంత ఉపశమనం లభించింది. అయితే వర్షంపై ఆధారపడిన రైతులు మాత్రం దిగులుతో వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు.


