రాయచూరు రూరల్: జిల్లాలో జరిగిన దళితుల హత్య కేసుల దర్యాప్తును సీఐడీకి అప్పగించాలని దమనిత సేనా సమితి సంచాలకుడు భరత్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో మాట్లాడారు. పాత కక్షల నేపథ్యంలో దేవదుర్గ తాలూకా గబ్బూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హద్దినాళలో బీఎస్పీ, దళిత కార్యకర్త భూమానందపై గొడ్డలితో హత్య, కరడకల్లో రేణుక హత్య, సిరవార తాలూకా హొక్రాణిలో అశ్వినిపై హత్యాచారానికి పాల్పడిన ఘటనలో ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ జిల్లాధికారి పూవితకు వినతిపత్రం సమర్పించారు.
అర్హులకే గ్యారెంటీల
లబ్ధి చేకూర్చండి
రాయచూరు రూరల్: పంచ గ్యారెంటీ పథకాలను అర్హులైన లబ్ధిదారులకే అందించాలని జిల్లా పంచ గ్యారెంటీ కమిటీ అధ్యక్షుడు పామయ్య మురారి పేర్కొన్నారు. మంగళవారం జెడ్పీ భవనంలో జరిగిన సమావేశంలో అధికారులతో మాట్లాడారు. మృతుల ఖాతాల్లో పడిన డబ్బుల వసూళ్లలో తర్జన భర్జనలు జరుగుతున్నట్లు తెలిపారు. అన్న భాగ్య పథకంలో నియమాలను ఉల్లంఘించిన 8 మంది డీలర్లు, 1847 కార్డులను రద్దు చేశామని, 1631 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అన్న భాగ్య పథకంలో డీబీటీ ద్వారా రూ.58.72 కోట్లు, శక్తి పథకంలో రూ.18 కోట్ల నిధులను విడుదల చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పంచ గ్యారెంటీలను కొనసాగిస్తామన్నారు. శాఖలు, అధికారుల మధ్య సహకారం లేకపోవడంతో పథకాలు దారి మళ్లుతున్నాయన్నారు. సమావేశంలో అధికారులు ఈశ్వర్ కుమార్, పావన్ పటేల్, పరశురామ్, మంజునాథ్లున్నారు.
పరమశివా.. పాహిమాం..
రాయచూరు రూరల్: సమాజంలో మానవుడికి సంస్కారంతో జీవన విధానం మారాలని బీదర్ దక్షిణ విధానసభ సభ్యుడు డాక్టర్ శైలేంద్ర బేల్దాళ్ అభిప్రాయపడ్డారు. సోమవారం బీదర్ తాలూకా పాపనాశినిలో భార్య నీతాతో పరమశివుడికి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. చిన్నతనంలో పిల్లలకు పాండిత్యం, సంస్కృతి, సంప్రదాయం, ఆచార, విచారాలను బోధించాలన్నారు.
పత్రికల ఏజెంటు మృతి
సాక్షి,బళ్లారి: గత 30 ఏళ్లుగా తెలుగు, కన్నడ, ఇంగ్లిష్, హిందీ తదితర పత్రికలకు ఏజెంటుగా పని చేస్తున్న ఎం.ఖమరుద్దీన్ సాబ్ (59) మృతి చెందారు. మంగళవారం బండిమోట్లోని తన నివాస గృహంలో ఆయన మృతి చెందడంతో పలువురు పత్రికల ఏజెంట్లు దివాకర్, రవి, రంగస్వామి, సర్క్యులేషన్ విభాగం ఎస్ఆర్ ఎర్రిస్వామి తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
పెట్టుబడిదారులకు
సొమ్ము చెల్లించాలి
రాయచూరు రూరల్: నగరంలోని దర్వేశి కంపెనీలో పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులకు డబ్బులు చెల్లించాలని పెట్టుబడిదార్లు డిమాండ్ చేిశారు. మంగళవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు అంబాజీ మైదునకర్ మాట్లాడుతూ మూడేళ్లు పూర్తి చేసుకుంటున్న దర్వేశి కంపెనీ రూ.800 కోట్ల వ్యాపార లావాదేవీలు జరిపి ప్రజలకు టోపీ వేసిన కంపెనీ నుంచి నిధులు వాపస్ ఇవ్వాలని కోరారు. ప్రజల నుంచి డబ్బులు డిపాజిట్ తీసుకున్న దర్వేశి కంపెనీ యాజమాన్యం చేతులెత్తేయడాన్ని ఖండించారు. చంద్రమౌళేశ్వర సర్కిల్ నుంచి పాదయాత్రను చేపట్టిన ఆందోళనస్థలానికి చేరారు.
రాయరెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు
హొసపేటె: ముస్లిం మతంలో నాలుగు లేదా ఐదు వివాహాలు చేసుకునే అవకాశం ఉంది. నాలుగు లేదా ఐదు వివాహాలు చేసుకోవాలనే కోరిక వల్లే ముస్లిం మతం శ్రేష్ఠమైనదని అన్నందుకు మంత్రి బసవరాజ రాయరెడ్డిపై శాసన మండలి సభ్యుడు సీటీ రవి విమర్శలు గుప్పించారు. విజయనగర జిల్లా హొసపేటెలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ రాయరెడ్డి ప్రపంచంలో ఇస్లాం గొప్ప మతం అని అన్నారు. మరణానికి ముందు ఇక్కడ లభించని అత్యాశను మరణానంతరం పొందాలని రాయరెడ్డి కోరుకుని ఉండవచ్చు. ఉగ్రవాదుల భయంతోనే ఇస్లాం ఉత్తమ మతం అన్ని చెప్పారని ఎద్దేవా చేశారు.


