హుబ్లీ: కారు బోల్తా పడిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన ధార్వాడ తాలూకా వెంకటాపుర గ్రామం వద్ద జాతీయ రహదారి– 4లో మంగళవారం జరిగింది. దావణగెరె జిల్లా కెరె యాగళహళ్లికి చెందిన వినాయక (25), బసవరాజ(34), హరిహర తాలూకా జిగళి గ్రామానికి చెందిన మంజునాథ(29) మృతులు. ధార్వాడ ఎలెగార వీధి బసవనగౌడ (26), దావణగెరె అభిషేక్ (30), అజయ్ (26) గాయపడ్డారు. బెళగావి నుంచి ధార్వాడకు వస్తుండగా ముందు ఉన్న వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో రోడ్డు డివైడర్ను ఢీకొని కారు బోల్తా పడింది. ఫలితంగా ముగ్గురు ఘటన స్థలంలోనే మృతి చెందారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటన స్థలాన్ని గరగ పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు. కేటరింగ్ పని కోసం ఎనిమిదేళ్ల నుంచి ధార్వాడలో నివాసం ఉండేవారు.
20 రోజులుగా సొంతూళ్లో బస
ఆషాఢ మాసంలో కేటరింగ్ ఆర్డర్లు లేకపోవడంతో దావణగెరె జిల్లాలోని తమ సొంత ఊర్లకు వెళ్లి 20 రోజుల పాటు అక్కడే ఉన్నారు. తిరిగి ధార్వాడకు సోమవారం రాత్రి బయలుదేరి డాబాలో భోజనం చేసి తిరిగి వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం వారి బంధువులు ధార్వాడకు వచ్చి మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరయ్యారు. బంధువు షణ్ముఖ మాట్లాడుతూ వినాయక తన అన్న కుమారుడు, బసవరాజ్ మా అల్లుడు, ఆషాడంలో కేటరింగ్ ఆర్డర్లు లేకపోవడంతో ఇటీవల ఊరికి వచ్చారు. బసవరాజ్, వినాయక ఇద్దరు కూడా ఆ ఇంటి ఆధార స్తంభాలు. పని చేసి ఇంటిని పోషించేవారు. బసవరాజ్కు తండ్రి లేరు. తల్లి కూలీ నాలీ చేసుకుంటుంది. మరో మృతుడి బంధువు అన్వేష్ మాట్లాడుతూ 7, 8 ఏళ్లుగా ధార్వాడలో కేటరింగ్ పని కోసం వెళ్లి అక్కడే ఉండేవారు. అప్పుడప్పుడు కెరె యాగళహళ్లికి వచ్చి వెళ్లేవారు. గత 20 రోజులుగా ఊరిలోనే ఉన్నారని, మృతులెవరికీ ఇంకా వివాహం కాలేదన్నారు. గత రాత్రి డాబాలో భోజనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మృతులంతా దావణగెరె జిల్లా వాసులు
ధార్వాడ తాలూకా వెంకటాపుర వద్ద జాతీయ రహదారిలో ఘటన


