రాయచూరు రూరల్: భారతీయ జనతా పార్టీ నాయకులు లింగసూగురు నుంచి బళ్లారి వరకు చేపట్టనున్న పాదయాత్ర హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి అజయ్ ధరమ్ సింగ్ తెలిపారు. సోమవారం సిరవార తాలూకా హోక్రాణి గ్రామంలో అశ్విని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రిగా పని చేసిన నాగేంద్ర రాజీనామా చేసిన తర్వాత కూడా బీజేపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ పాదయాత్ర చేస్తున్నారని ఆరోపించారు. విధానసభ సమావేశాల్లో కరువు పరిస్థితులు, రైతుల ఇబ్బందులు, కస్తూరి రంగన్ నివేదిక తదితర ముఖ్యమైన అంశాలపై బీజేపీ నేతలు నోరు విప్పలేదన్నారు. కేవలం మాజీ మంత్రి నాగేంద్ర రాజీనామా అంశాన్ని పట్టుకుని విధానసభ సమయాన్ని వృథా చేశారని మండిపడ్డారు. కార్యక్రమంలో విధాన పరిషత్ సభ్యుడు బోసురాజ్, ఎమ్మెల్యే హంపయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారు.
హత్య కేసులను సీఐడీకి అప్పగించాలి
రాయచూరు రూరల్: జిల్లాలో జరిగిన దళితుల హత్య కేసులను సీఐడీకి అప్పగించాలని చలవాది మహాసభ సమితి సంచాలకుడు విశ్వనాథ్ పట్టి డిమాండ్ చేశారు. సోమవారం ప్రభుత్వ అతిథి గృహంలో రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి అజయ్ ధరమ్ సింగ్కు వినతిపత్రం అందజేశారు. వసంత్, తమ్మణ్ణ, విజయ్ ప్రసాద్, బాబుజీ, పుష్పరాజ్, శరణప్ప, వీరేష్, భీమేష్ పాల్గొన్నారు.


