రాయచూరు రూరల్: మాన్వి తాలూకా హుసేనపుర క్రాస్ వద్ద శనివారం సాయంత్రం రమేష్ నక్కుంది (28) అనే దళిత యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం సృష్టించింది. ఇది హత్యనా లేక మరేదైనా కారణంతో యువకుడు మృతి చెందాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) అరుణాంగ్షు గిరి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గడిచిన 11 రోజుల్లోనే జిల్లాలో వరుసగా నాలుగు అనుమానాస్పద మరణాలు సంభవించడం స్థానికులను భయాందోళనలకు గురి చేస్తోంది. లింగసూగూరు తాలూకా కరకడకల్లో రాణెమ్మ, హద్దనాళలో భూమానంద, హోక్రాణి గ్రామంలో అశ్విని ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సింధనూరు డీఎస్పీ చంద్రశేఖర్ నాయక్, సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) కెంచరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రమేష్ మృతికి పూర్తి కారణాలు విచారణలో తెలిసే అవకాశం ఉంది.


