బనశంకరి: అసెంబ్లీ సమావేశాలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. ప్రణాళిక, గణాంక శాఖ మంత్రి బి.నాగేంద్ర రాజీనామా చేయాలని ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆందోళనలు చేయడంతో సీఎం డీకే శివకుమార్ ఏకంగా సమావేశాలనే రద్దు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెల 13వ తేదీన ఆరంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు 27వ తేదీ వరకు జరుగుతాయని ఆరోజే ప్రకటించారు. కానీ ప్రతిపక్షాల రగడతో 3 రోజులు ముందుగానే ముగించేశారు.
పారిపోయారా?
ప్రభుత్వ తీరుపై బీజేపీ పక్షనేత ఆర్.అశోక్ ధ్వజమెత్తారు. 20, 30 ఏళ్లలో మొదటిసారి ప్రతిపక్షాలకు ప్రభుత్వం భయపడి పారిపోయింది, సభాపతి సభను సరైన రీతిలో నిర్వహించలేదని అన్నారు. మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలిలో దళితుల డబ్బులు మింగేశారని, ఈ డబ్బు వెనక్కి రప్పించాలన్నారు. పార్కుల్లో 5 శాతం స్థలాల లూటీకి సిద్ధమయ్యారన్నారు. కాంగ్రెస్ వెనుక వాకిలి నుంచి పారిపోయిందని, ఇది అవినీతితో అవినీతిపరుల కోసం నడుపుతున్న ప్రభుత్వమని దుయ్యబట్టారు. అవినీతి గుట్టు రట్టవుతుందని నాగేంద్ర ను కాపాడుతున్నారు, రూ.85 కోట్లు కుంభకోణం అని గతంలో సీఎం సిద్దరామయ్య ఒప్పుకున్నారన్నారు.
అసెంబ్లీ ముట్టడికి యత్నం
మహర్షి వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలి నిధుల స్కాంలో నిందితునిగా ఉన్న మంత్రి బీ నాగేంద్ర రాజీనామా చేయాలని రాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సోమవారం ఫ్రీండంపార్కులో ధర్నా చేపట్టారు. తరువాత పాదయాత్రగా విధానసౌధ ముట్టడికి బయల్దేరగా, పోలీసులు అడ్డుకున్నారు. బీజేపీ పక్షనేతలు ఆర్.అశోక్, చలవాది నారాయణస్వామి, బీవై విజయేంద్ర, శ్రీరాములు, అశ్వత్నారాయణ సహా పెద్దసంఖ్యలో నేతలు పాల్గొన్నారు. నాగేంద్ర రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ వ్యంగ్య చిత్రాలను ప్రదర్శించారు. నాగేంద్రను తొలగించకపోతే వీధుల్లో పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. మూడువైపుల నుంచి అసెంబ్లీ భవనం ముట్టడికి యత్నించారు. దీంతో నేతలు, పోలీసుల మధ్య తోపులాటలు జరిగాయి. కొందరు నాయకులను పోలీసులు ఎత్తుకెళ్లి వాహనాల్లోకి ఎక్కించి తరలించారు.
3 రోజుల ముందే సమాప్తం
మంత్రి నాగేంద్ర రాజీనామాకు
బీజేపీ, జేడీఎస్ పట్టు
ప్రతిపక్షాల నిరసనలతో డీకే సర్కారు
అనూహ్య నిర్ణయం


