రాయచూరు రూరల్: ఈనెల 27 నుంచి సెప్టెంబర్ 2 వరకు మంత్రాలయ రాఘవేంద్రస్వామి 355వ ఆరాధనోత్సవాలు, సప్తరథోత్సవాలు నిర్వహిస్తున్న తరుణంలో తుంగభద్ర నదిలో నీరు అడుగంటి పోయాయి. కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, గోవా, కేరళ, పాండిచ్చేరిల నుంచి వచ్చే భక్తులకు మౌలిక సౌకర్యాలు కల్పించామని మఠం చెబుతున్నా నీటి విషయంలో మాత్రం ఆలయ పాలక మండలి మౌనం దాల్చింది. హొసపేటెలోని తుంగభద్ర డ్యాం పూర్తి స్థాయిలో నిండడానికి రెండు అడుగులు నీరు ఇంకా వచ్చి చేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆలయ పాలక మండలి కర్ణాటక సర్కార్కు, హొసపేటెలోని తుంగభద్ర డ్యాం అధికారులకు లేఖలు రాయలేదు. మరో 2 రోజుల్లో ఆరాధనోత్సవాలు ప్రారంభమవుతున్న తరుణంలో మాధవరం వద్ద తుంగభద్ర నది నీరు లేక వట్టిపోయింది. భక్తులు పుణ్య స్నానాలకు ఇబ్బంది పడకుండా తుంగభద్ర డ్యాం నుంచి నీటిని వదలడానికి డ్యాం అధికారులు చర్యలు చేపట్టాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


