రాయచూరు రూరల్: ఉప్పార సమాజ అభివృద్ధి మండలికి రాష్ట్ర ప్రభుత్వం రూ.40 కోట్లతో ప్రతిపాదనలు పంపించగా, రాప్రభుత్వం రూ.11 కోట్ల నిధులు విడుదల చేసిందని ఉప్పార సమాజం అభివృద్ధి మండలి రాష్ట్ర అధ్యక్షుడు భరమణ్ణ ఉప్పార్ వెల్లడించారు. సోమవారం ఉప్పార లక్ష్మీ వేంకటేశ్వరాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, ఆరోగ్య, గంగా కళ్యాణ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులను ఆదుకుంటామన్నారు. నిరుద్యోగులకు ప్రత్యేక పఽథకాలను రూపొందించారన్నారు. ఈ సందర్భంగా పాగుంటప్ప, చంద్రశేఖర్, వెంకోబ, ఆదిరాజు, రవి కుమార్లున్నారు.
కాలువలకు సక్రమంగా
సాగునీరు వదలండి
సాక్షి,బళ్లారి: ఈ ఖరీఫ్ సీజన్లో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీలకు పూర్తి స్థాయిలో సాగునీరు విడుదల చేయాలని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బీజేపీ రైతు మోర్చా ఆధ్వర్యంలో గురులింగగౌడ, విరుపాక్షిగౌడ, ఐనాథరెడ్డి తదితరులు పెద్ద సంఖ్యలో జిల్లాధికారి కార్యాలయంలో ఆయకట్టు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈనెల 11న మునిరాబాద్ వద్ద జరిగిన ఐసీసీ సమావేశంలో అన్ని కాలువలకు నీరు విడుదల చేయాలని చేసిన తీర్మానానికి అనుగుణంగా కాలువలకు నీరు విడుదల చేయాలన్నారు. ఖరీఫ్లో వరి, మిర్చి నాట్లు వేయడానికి రైతులు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో నీరు సక్రమంగా అందించాలని ఒత్తిడి చేశారు.
బావిలో శవమైన
నవ వివాహిత
చెళ్లకెరె రూరల్: నవ వివాహిత మృతదేహం ఓ బావిలో లభ్యమైంది. చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరె తాలూకా మహదేవపుర కరిపాలయ్యనహట్టికి చెందిన సుమలత(21) అనే నవ వివాహిత మృతదేహం బావిలో కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆగస్టు 13 నుంచి కనిపించకుండా పోయిన సుమలత ప్రేమ వివాహం చేసుకున్న గజేంద్రతో కలిసి వెళ్లిందని, అయితే ఆదివారం సాయంత్రం బావిలో మృతదేహం కనిపించడంతో గజేంద్రతో పాటు పలువురిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దేశాన్ని అగౌరవ
పరచడం తగదు
రాయచూరు రూరల్: దేశ రాజధాని న్యూఢిల్లీలో వందేమాతరం గీతాలాపనలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అశ్లీలంగా ప్రవర్తించారని, దేశాన్ని అగౌరవ పరిచే విధంగా నడుచుకోవడం తగదని బీజేపీ యువ మెర్చా ఖండించింది. ఆదివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు వినాయక్రావ్ మాట్లాడారు. అసభ్యంగా ప్రవర్తించి దేశ గౌరవాన్ని మంటగలిపారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదన్నారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర, రవీంద్ర, శివ కుమార్, శరణమ్మ, విజయ రాజేశ్వరి, బండేష్, ఽశంశాలం, నరసింహులు, యల్లప్పలున్నారు.
పిల్లలకు పాలు పంపిణీ
రాయచూరు రూరల్: శ్రావణ మాస నాగ పంచమి వేడుక సందర్భంగా నాగ ప్రతిమలకు, పుట్టలకు పాలు పోసే బదులు పిల్లలకు పాలు పంపిణీ చేశారు. సోమవారం నగరంలోని అంబేడ్కర్ నగర్లో మురికి వాడల సంఘం, రవి పాటిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు జనార్దన్ పిల్లలకు పాలు అందించారు. పాములు పాలు తాగవని అన్నారు. రాష్ట్రంలో అపౌష్టికతతో నలిగి పోతున్న 40 లక్షల మంది చిన్నారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. లక్ష్మణ్, అనిల్ కుమార్, బసవరాజ్, ప్రసాద్, జంబణ్ణ, మాధవరెడ్డి, రాజు, పద్మావతిలున్నారు.


