రాయచూరు రూరల్: ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ విరమణ సహజం. ఉద్యోగులు అందించిన సేవలు శాశ్వతంగా నిలిచిపోతాయని కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు తెలిపారు. ఆదివారం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా సేవలందించి ఉద్యోగ విరమణ చేసిన ముద్దన గౌడకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు అందించడంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని పేర్కొన్నారు. విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతస్థాయికి చేర్చేందుకు శ్రమిస్తారని కొనియాడారు.
మొళకాల్మూరు
ఎవరికీ పట్టదా?
● ఎమ్మెల్యే ఎన్.వై.గోపాలకృష్ణ ఆగ్రహం
సాక్షి, బళ్లారి: ‘మొళకాళ్మూరు నియోజకవర్గానికి రాష్ట్రంలోనే గుర్తింపు లేదు. ఏదో మూలన పడి ఉన్నాం. రాష్ట్రంలోని ప్రభుత్వ పెద్దలు ఈ నియోజకర్గాన్ని అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్.వై.గోపాలకృష్ణ ఆరోపించారు. తనకు మంత్రి రాకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొళకాళ్మూరు నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లో చేరిస్తే అభివృద్ధి చెందుతుందేమో అని ఎద్దేవా చేశారు. అలా వీలుకాకపోతే చెళ్లకెరె నియోజకవర్గంలో అయినా కలిపితే అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. నియోజకర్గాన్ని ఎవరు పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందని పేర్కొన్నారు. ఇన్చార్జి మంత్రికి కూడా నియోకవర్గ సమస్యలు తెలియజేశామని వెల్లడించారు. ఎక్కువ నిధులు కేటాయిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు వీలవుతుందన్నారు. కాగా అధికార పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంపై ఈ వ్యాఖ్యలు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
కనీస వేతనాలు అందించరూ..
రాయచూరు రూరల్: ఆరోగ్య శాఖలో పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అందించాలని సీపీఐఎంఎల్ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంచాలకురాలు మైత్రేయ మాట్లాడారు. కార్మికుల నమోదు ప్రక్రియ, రెన్యూవల్, ఆరోగ్య భాగ్య, విద్య, పింఛన్, ఇతర పథకాలపై కార్మికులకు వివరించాలని తెలిపారు. రాష్ట్ర సర్కార్ ఆధీనంలో విధులు నిర్వర్తించే కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేసేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. కార్మికులకు అన్ని సౌలభ్యాలు సక్రమంగా అందేలా చూడాలని సూచించారు.
నిస్వార్థంగా
సేవ చేయడం హర్షణీయం
రాయచూరు రూరల్: ఎలాంటి లాభాపేక్ష లేకుండా నిరంతరం ప్రజా సమస్యలపై స్పందించే స్వభావం కలిగి ఉండాలని తారనాథ విద్యా సంస్థల అధ్యక్షుడు సుఖాణి సూచించారు. ఎల్వీడీ కళాశాలలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో సాధకులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తారనాథుడు విద్య, వైద్య రంగాలకు చేసిన సేవలు ఎనలేనివని కొనియాడారు. వివిధ సమస్యలపై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి సమస్యల పరిష్కారానికి విద్యా పాటిల్ కృషి చేశారని తెలిపారు. వైద్య రంగంలో ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసిన బూబ్ను సన్మానించారు. కార్యక్రమంలో హందర్ పాఠశాల సమితి సభ్యులు పురుషోత్తం ఇన్నాణి, అంబాపతి పాటిల్, శ్రీనివాస్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఆందోళనకు
అనుమతి నిరాకరణ
హుబ్లీ: ధార్వాడ మిసిగన్ కాంపౌండ్ వద్ద ఈనెల 18న అక్సా సంఘాల ఆధ్వర్యంలో నిరుద్యోగులు చేపట్టనున్న ఉద్యోగ కాంక్షల ఆందోళనకు హుబ్లీ ధార్వాడ పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ అనుమతి నిరాకరించారు. గతంలో ఆందోళన సందర్భంగా జరిగిన అవాంఛనీయ ఘటనలను కారణంగా చూపుతూ అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. గతంలో ధార్వాడ హైకోర్టు పీఠం హుబ్లీ నెహ్రు మైదానంలో గరిష్టంగా 100 మందికి పరిమితం చేస్తూ శాంతి యుత ఆందోళన నిర్వహణకు షరత్తులతో అవకాశం కల్పించింది. నిర్వహకులు కోర్టు సూచించిన స్థలంలో ఆందోళన చేపట్టలేదు. శాంతి భద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో అనుమతి నిరాకరించినట్లుగా కమిషనరేట్ కార్యాలయం తెలియజేసింది.


