బనశంకరి: బెళగావి నగరంలో ఆఫీసు తెరిచి వేలాది మంది నుంచి అక్రమంగా డిపాజిట్లు సేకరించిన కేసులో శివానంద నీలణ్ణవర్కు చెందిన శివం అసోసియేట్స్ కంపెనీ ఆస్తిపాస్తులపై ఈడీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. శుక్రవారంతో పాటు శనివారం కూడా బెళగావిలోని శివబసవ నగరలోని ఎంహెచ్ టవర్లో సోదాలు నిర్వహించారు. పెట్టుబడి పెడితే ఎక్కువ మొత్తంలో వడ్డీలు, లాభాలు ఇస్తామని వేలాది మంది ఉద్యోగులు, ప్రజల నుంచి ఇతడు రూ.4 వేల కోట్లకు పైగా వసూలు చేసినట్లు కేసులు నమోదయ్యాయి. ఆ డబ్బుతో జల్సాలు, ఆస్తుల కొనుగోళ్లు చేసుకున్నాడు. కోట్లాది రూపాయల జాడ లేదు. దీనిపై సీడీఐ దర్యాప్తు చేస్తోంది. ఇంతలో ఈడీ కూడా అక్రమ నగదు బదిలీ కింద కేసు నమోదు చేసి దాడులు తీవ్రతరం చేసింది. బెళగావి, చిక్కోడి, హుక్కేరి సహా అతని బంధువుల ఇళ్లలో సీఆర్పీఎఫ్ భద్రతతో సోదాలు జరుగుతున్నాయి. కేవలం ఫైళ్లకు పరిమితం కాకుండా ఇళ్లు, ఆఫీసుల్లో లభించిన ప్రతి ఆధారాన్ని పరిశీలించి ఆర్థిక మోసాలపై సమాచారం రాబడుతున్నారు. అతని భార్య, సోదరున్ని ప్రశ్నించారు. కాగా ఇటీవల బెయిలుపై విడుదలపై శివానంద ఈడీ దాడులకు కొంతసేపు ముందు పరారైనట్లు తెలిసింది.


