యశవంతపుర: బెంగళూరులో ర్యాపిడో బైక్లో ప్రయాణిస్తుండగా కింద పడి గాయపడిన యువతి ఆస్పత్రి ఖర్చులు రూ.20 లక్షలు దాటిపోయాయి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తరువాత బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బెంగళూరు బైరసంద్రలో ఉంటే ఇంటీరియర్ డిజైనర్గా పనిచేసే శానీ కృష్ణ బాధితురాలు. ఆమె ఆఫీసుకు వెళ్లాలని జూన్ 17న ర్యాపిడో బైక్ ఎక్కింది. రైడర్ నిర్లక్ష్యంగా నడపడంతో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలైన ఆమెను కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్చగా రూ.20 లక్షలకు పైగా ఖర్చయింది. తన ఆవేదనపై ఆమె సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ఆ సంస్థకు ఫిర్యాదు చేసినా ఏమీ స్పందన లేదని వాపోయింది.


