సాక్షి,బళ్లారి: వ్యవసాయంలో కాని, ఇతర రంగాల్లో కాని ఉత్పత్తి చేయడమే కాదని, నాణ్యత, గ్రేడింగ్తో పాటు మార్కెటింగ్పై కూడా పూర్తిగా అవగాహన అవసరం ఉందని, ఎగుమతులు చేస్తే మంచి లాభాలు వస్తాయని, ఆ దిశగా ఆలోచించి ముందుకెళ్లాలని బీఐటీఎం కళాశాల డైరెక్టర్ పృథ్విరాజ్ పేర్కొన్నారు. ఆయన గురువారం నగరంలో బీబీసీ కళాశాలలో ఎక్స్పోర్ట్ కనెక్ట్–2026 వ్యాపార అవగాహన సదస్సు ప్రారంభించి మాట్లాడారు. ఏదైనా రంగంలో కేవలం వస్తువులను తయారు చేయడం వల్ల మాత్రమే విజయం సాధించలేమని, సమర్ధవంతమైన మార్కెటింగ్ కూడా ఉండాలన్నారు. మార్కెటింగ్ చేయాలంటే ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమన్నారు. పలువురు వక్తలు మాట్లాడుతూ కర్ణాటకలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో విజన్ కర్ణాటక ఫౌండేషన్, కర్ణాటక టెక్నాలజీ అప్గ్రెడేషన్ బోర్డు, జిల్లా పరిశ్రమల కేంద్రం సంయుక్తంగా పని చేస్తున్నాయన్నారు. పరిశ్రమలు నాణ్యత, ఉత్పత్తి, పోటీతత్వాన్ని పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలపై వివరించారు. ఎగుమతులపై పూర్తిగా అవగాహన పెంచుకుని ముందుకెళ్లాలన్నారు. ప్రముఖులు గౌరీశంకర్, శ్రీధర్ నాగభూషణ, పరిశ్రమల అధికారి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు పలువురు ప్రముఖులను ఘనంగా సన్మానించారు.
బీఐటీఎం కళాశాల డైరెక్టర్ పృథ్విరాజ్


