హుబ్లీ: రాష్ట్రంలో తీవ్రమైన కరువు ఛాయలు నెలకొన్న నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటైన కరువు అధ్యయన బృందం బుధవారం ధార్వాడ జిల్లాలో పర్యటించి అన్నదాతల ఆవేదనను స్వయంగా తెలుసుకుంది. ఎమ్మెల్సీ రవికుమార్ నేతృత్వంలో బృందం కుందగోళ తాలూకా గుడెకట్టి గ్రామ శివారులో వర్షాభావంతో పూర్తిగా ఎండిపోయిన పెసర పంట పొలాలను పరిశీలించింది. స్థానిక రైతులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలను, వారి గోడును బృందం ఆలకించింది. పొలంలో విత్తిన విత్తనాలన్ని మట్టిపాలు కావడాన్ని తిలకించింది. తహసీల్దార్, వ్యవసాయ శాఖ అధికారుల నుంచి పంట నష్టం, వర్షాభావం, ప్రభుత్వం తీసుకున్న పరిహార చర్యల గురించి తెలుసుకున్నారు. అనంతరం రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ కరువు కాటుతో బాధపడే ఉత్తర కర్ణాటక రైతులకు ప్రభుత్వం తక్షణమే ఎకరాకు రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. పంట నష్ట అధ్యయనాన్ని పారదర్శకంగా నిర్వహించి బాధల్లో ఉన్న రైతులకు తగిన పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఆయన ఎండగట్టారు. బృందంలో జిల్లా ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ బసవరాజ్ బొమ్మైతో పాటు బీజేపీ ప్రముఖులు పాల్గొన్నారు.


