హొసపేటె: విజయనగర జిల్లా హగరిబొమ్మనహళ్లి పోలీస్ స్టేషన్లో ఇటీవల మరణించిన అమాయక పేద కార్మికుడి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని అంజుమన్ కమిటీకి చెందిన నూర్ అహ్మద్ అన్నారు. ఆయన పట్టణంలో మృతుని కుటుంబాన్ని ఓదార్చిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా ఎస్పీ నిజం బయట పెట్టాలన్నారు. ఒక వైపు పోలీసులు కొట్టి చంపగా, ఉన్నతాధికారులు కనీసం బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున నష్టపరిహారం అందించలేదన్నారు. వారికి చిన్న పిల్లలు ఉన్నారు. బాధిత కుమార్తె ఎలా బతకాలి? వారిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం మాని, న్యాయం జరిగేలా ఏదైనా చేయాలి. రాబోయే రెండు రోజుల్లో సీసీ టీవీ ఫుటేజీని విడుదల చేయకపోతే, ఈ విషయాన్ని హోం మంత్రి దృష్టికి తీసుకువెళ్తామన్నారు. భవిష్యత్తులో న్యాయం జరగాలంటే ఈ మరణంపై పూర్తి పారదర్శకంగా న్యాయ విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ కౌన్సిలర్ ఇస్మాయిల్, కే.ఇస్మాయిల్, న్యాయవాది బషీర్ అహ్మద్ హాజరయ్యారు.


